తిరుపతి టీడీపీలో లోకేష్ జోష్, కీలక నిర్ణయం..!
తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కీలక మార్పు చోటుచేసుకుంది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా ప్రముఖ నేత మన్నెం శ్రీనివాస్ ప్రసాద్ నియమితులయ్యారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ అధికారిక నియామక ఉత్తర్వులను జారీ చేశారు. తిరుపతిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధిష్ఠానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
మన్నెం శ్రీనివాస్ ప్రసాద్కు తిరుపతి నియోజకవర్గ ప్రజల్లో, ముఖ్యంగా స్థానిక ఓటర్లలో మంచి ప్రజాదరణ కలిగిన నేతగా పేరుంది. గత కొన్నేళ్లుగా ఆయన నియోజకవర్గంలో చురుకైన పాత్ర పోషిస్తూ.. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు. కూటమి ప్రభుత్వ సిద్ధాంతాలకు, పార్టీ ఆశయాలకు కట్టుబడి నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉన్న శ్రీనివాస్ ప్రసాద్ సేవలను గుర్తించిన అధినాయకత్వం.. ఆయనకు ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. రాబోయే రోజుల్లో కూటమి అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు.
మన్నెం శ్రీనివాస్ ప్రసాద్ను తిరుపతి ఇన్ఛార్జ్గా ప్రకటిస్తూ పార్టీ అధికారిక నిర్ణయం తీసుకోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ పండుగ వాతావరణాన్ని తలపించేలా సంబరాలు చేసుకుంటున్నారు. సరైన నాయకుడికి బాధ్యతలు అప్పగించారంటూ స్థానిక తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.








