కుప్పంలో ఇండస్ట్రియల్ విప్లవం, తొలి బ్యాటరీ అనోడ్ ప్లాంట్..!
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పలు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టంగా.. భారతదేశంలోనే మొట్టమొదటి ‘బ్యాటరీ అనోడ్ మెటీరియల్’ తయారీ యూనిట్కు కుప్పంలో పునాది పడనుంది. ఎలక్ట్రానిక్ మరియు ఈవీ (EV) వాహనాల విప్లవంలో అత్యంత కీలకమైన ఈ బ్యాటరీ మెటీరియల్ ప్లాంట్ను కుప్పంలో ఏర్పాటు చేయడం ద్వారా దేశీయ పారిశ్రామిక రంగం చూపు ఏపీ వైపు తిరిగేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఎవరూ ఊహించని విధంగా కుప్పం వేదికగా విమానాల (ఎయిర్క్రాఫ్ట్) తయారీకి సైతం శ్రీకారం చుడుతున్నారు. ‘పయనీర్ క్లీన్ ఆంప్స్’ (Pioneer Clean Amps) సంస్థ ద్వారా ఏర్పాటు కానున్న ఎయిర్క్రాఫ్ట్ తయారీ యూనిట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు, ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్ ‘అడిడాస్’ (Adidas) ఫుట్వేర్ తయారీ యూనిట్ కూడా కుప్పంలో కొలువుదీరనుంది. అక్షరాలా రూ.899 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ అంతర్జాతీయ ఫుట్వేర్ ప్లాంట్ ద్వారా స్థానికంగా ఉన్న దాదాపు 20 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
కుప్పంలో వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక అవసరాలను, విద్యుత్ డిమాండ్ను తట్టుకునేందుకు ప్రభుత్వం రూ.952 కోట్ల వ్యయంతో 3 భారీ ట్రాన్స్కో సబ్స్టేషన్లను నిర్మించింది. ఈ మౌలిక వసతుల కల్పనతో పాటు, ‘అబిస్ ప్రొటీన్స్’ (ABIS Proteins) కు చెందిన అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్ను, అలాగే స్థానిక నిరుద్యోగులు, చిన్నతరహా పరిశ్రమల కోసం సిద్ధం చేసిన ‘ఏపీఐఐసీ ఎంఎస్ఎంఈ’ (APIIC MSME) పార్క్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రారంభించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టుల రాకతో కుప్పం నియోజకవర్గం రాబోయే రోజుల్లో ఏపీలోనే మోస్ట్ పవర్ఫుల్ ఇండస్ట్రియల్ హబ్గా మారబోతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.








