చైనాతో జాగ్రత్త.. పుతిన్ ను హెచ్చరించిన బైడెన్

చైనాతో జాగ్రత్తగా ఉండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను తాను హెచ్చరించానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ప్రచ్చన్నయుద్ధం నాటి రోజులు కావని, సరిహద్దుల్లోని చైనా దూకుడును గమనించాలని తాను కోరినట్లు తెలిపారు. రష్యాతో సన్నిహిత సంబంధాలకు అమెరికా సిద్ధంగా ఉందని, ఈ చర్చలను మున్ముందు కూడా కొనసాగిస్తామని అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చలపై సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాత్మకంగా సాగాయని అన్నారు. అమెరికాతో ఎలాంటి విరోధం లేదని తెలిపారు. అమెరికా, రష్యా మధ్య సంబంధాలు ప్రచ్ఛన్నయుద్ధం కాలం నాటి స్థాయికి దిగిజారిపోయాయని అందరూ భావిస్తున్న తరుణంలో ఈ జో బైడెన్, వ్లాదిమిర్ పుతిన్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో రెండున్నరగంటలకు పైగా చర్చలు జరిపారు.
అనంతరం విడివిడిగా మీడియాతో మాట్లాడారు. పుతిన్ మాట్లాడుతూ బైడెన్ అనుభవమున్న వ్యక్తి అని అన్నారు. చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయి. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ట్రంప్తో పోలిస్తే బైడెన్ భిన్నమైన వ్యక్తి అని
పుతిన్ తెలిపారు. రాయబారుల అంశంపై రెండు దేశాలు అవగాహనకు వచ్చినట్లు పుతిన్ తెలిపారు. రష్యా హ్యాకర్లు తమ సంస్థలపై దాడి చేశారని పేర్కొంటూ ఆ దేశ రాయబారులను బైడెన్ ప్రభుత్వం వెనక్కి పంపింది. అంతకుముందు రష్యా అదే పని చేసింది. ఈ చర్చల్లో ఆ సమస్య పరిష్కారమైనట్లు పుతిన్ పేర్కొన్నారు. సైబర్ దాడుల అంశంపై అడిగిన ప్రశ్నకు పుతిన్ ఎదురుదాడి చేశారు. అమెరికాయే సైబర్ దాడులు చేసిందన్నారు. ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ నిర్బంధాన్ని పుతిన్ సమర్థించుకున్నారు. నావల్నీ రష్యా చట్టాలను ఉల్లంఘించారని తెలిపారు. తనపై కేసులున్నాయని తెలిసి కూడా ఆయన దేశం విడిచి పారిపోయారని తెలిపారు.