అధ్యాపక నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి : మంత్రి లోకేష్
ఇప్పటివరకు వివిధ యూనివర్సిటీలకు 1.89 లక్షల దరఖాస్తుల రాక
రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకై విధివిధానాల రూపకల్పన
జాబ్ మేళాల ద్వారా ఇప్పటివరకు 1.30లక్షలమందికి ఉద్యోగాలు
పీఎం సేతు పథకం కింద రాష్ట్రానికి 5 క్లస్టర్లు మంజూరు చేసిన కేంద్రం
ఉన్నత విద్య, స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
అమరావతి: రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసెర్ల రిక్రూట్ మెంట్ ను మరింత పారదర్శకత, నాణ్యత, స్థిరత్వంతో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… వివిధ యూనివర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టులకు ప్రకటించిన ఫ్యాకల్టీ రిక్రూట్ నోటిఫికేషన్ విడుదల తర్వాత వచ్చిన దరఖాస్తులపై అధికారులను వాకబు చేశారు. అధికారులు సమాధానమిస్తూ ఇప్పటివరకు 1,89,316 అఫ్లికేషన్లు వచ్చాయని చెప్పారు. ప్రతిదరఖాస్తును డేటా డ్రివెన్ క్రాస్ వెరిఫికేషన్ చేయాల్సిందిగా మంత్రి సూచించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రాతపరీక్షకు సంబంధించి ఇప్పటికే సిలబస్ ఇచ్చామని చెప్పారు. యూనివర్సిటీ యూనిట్ గా రిక్రూట్ మెంట్ చేపడుతున్నందున… సెలక్షన్ కమిటీలకు ఎంపిక ప్రక్రియపై స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వాలి, వీలైనంత త్వరగా యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేయాలని అన్నారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించి విధివిధానాల రూపకల్పనపై మంత్రి సమీక్షిస్తూ ఇండస్ట్రీ లింకేజి, సెక్టార్ టై అప్ నిబంధన ఖచ్చితంగా ఉండాలని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని స్కిల్ యూనివర్సిటీల స్థాపనకు దేశంలోనే ఒక నమూనాగా ఈ చట్టం ఉండాలని అధికారులకు సూచించారు.
వచ్చే నెలలో నైపుణ్యం పోర్టల్ ఆవిష్కరణ
స్కిల్ డెవలప్ మెంట్ పై మంత్రి లోకేష్ సమీక్షిస్తూ… నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా తయారుచేసిన నైపుణ్యం పోర్టల్ ను జులైలో ఆవిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందులో నమోదైన ప్రతి వ్యక్తికి ఆన్ లైన్ స్కిల్ కార్డు జారీచేస్తామని చెప్పారు. పీఎం సేతు పథకం కింద రాష్ట్రానికి 5 క్లస్టర్లు మంజూరయ్యాయి. ఇందులో స్టీల్, షిప్ బిల్డింగ్, పెట్రో కెమికల్ క్లస్టర్ ఏర్పాటుకు అర్సెలర్ మిట్టల్ సంస్థ ముందుకు వచ్చింది. రెన్యువబుల్ ఎనర్జీ, ఫార్మా, ఆక్వా, శ్రీసిటీ మొదలగు క్లస్టర్ల లో కూడా పిఎం సేతు పథకం కింద ఐటిఐ లను బలోపేతం చెయ్యాలని మంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలలో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అన్నారు. ఇటీవల నాక్ ఆధ్వర్యాన చేపట్టిన సెమినార్ లో 92 నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం వహించాయి, సెయింట్ గోబెన్స్, అల్ట్రాటెక్ వంటి ప్రఖ్యాత సంస్థలు 5 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని అధికారులు తెలిపారు.
ఓంక్యాప్ ద్వారా విదేశాల్లో ఉద్యోగావకాశాలు
ఓంక్యాప్ ఆధ్వర్యాన వచ్చే నెలలో 146మందికి విదేశీ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు అధికారుల చెప్పారు. ఇందులో 84మంది నర్సులు, 16మంది బ్లూకాలర్ అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు. జపాన్ లో హెల్త్ కేర్ వర్కర్లకు డిమాండ్ ఉన్నందున… ఆ కోర్సులు చేసిన అభ్యర్థులకు అవకాశాలు కల్పించడంపై దృష్టిసారించాలని మంత్రి లోకేష్ సూచించారు. క్వాంటమ్ ఏఐ స్కిల్లింగ్ ప్రణాళిక అమలు పురోగతిపై సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా ఇప్పటివరకు 1,30,422 మందికి ఉద్యోగాలు కల్పించామని అధికారులు తెలిపారు. ప్రతి క్వార్టర్ కు ఒకసారి నియోజకవర్గ కేంద్రాల్లో జాబ్ మేళాల నిర్వహించాలని మంత్రి లోకేష్ సూచించారు. స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ద్వారా రాష్ట్రస్థాయిలో స్టేట్ ఎంప్లాయ్ మెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ (SEOS) ఏర్పాటుచేసి సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటర్ చేస్తున్నామని అన్నారు. దీనికి అనుసంధానంగా డిస్ట్రిక్ట్ లెవల్ ప్లేస్ మెంట్ టీమ్ లను ఏర్పాటుచేసి ప్లేస్ మెంట్ ఆఫీసర్లను నియమించనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో జిల్లా స్థాయి నైపుణ్య అధికారుల సమావేశం నాటికి కేపిఐ డ్యాష్ బోర్డు ను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్త, స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఎండీ గణేష్ కుమార్ పాల్గొన్నారు.








