చికాగోలో ఘనంగా ఓయు శతాబ్ది ఉత్సవాలు
చికాగో నగరంలోని శాలిమార్ బాంకెట్స్లో గ్లోరీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒయు వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం హాజరయ్యారు. న్యూయార్క్, హోస్టన్, శాన్ఫ్రాన్సిస్కో, మిన్నెసోటా, ఇండియానా మొదలైన నగరాల నుంచి వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా సావనీర్ను అతిథులతో కలిసి వి.సి ప్రొ.రామచంద్రం ఆవిష్కరించారు. అలాగే ఉస్మానియాపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కూడా వి.సి ప్రారంభించారు. ఆహుతుల కోసం ఉస్మానియా యూనివర్సిటీ డాక్యుమెంటరీ ఫిల్మ్ను ప్రదర్శించారు. దీంతో పూర్వ విద్యార్థులు తాము ఓ.యూలో చదువుకునప్పటి రోజులు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎస్.రామచంద్రం మాట్లాడుతూ నేడు ఓ.యూ ఉన్నత విద్యా కేంద్రంగా విలసిల్లుతూ గ్లోబల్ యూనివర్సిటీగా ఎదిగిందని చెప్పారు. కాన్సుల్ జనరల్ ఆఫ్ చికాగో నీతా భూషణ్ మాట్లాడుతూ ఒయులో చదివిన విద్యార్థులు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో, వివిధ హోదాల్లో స్థిరపడ్డారని, ఇది ఓయూకు ఎంతో బలాన్ని ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, ఇల్లినోయిస్ గవర్నర్ ఆఫీస్ సిఐవో హార్దిక్ భట్, గ్లోరీ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షులు మీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.













