టెక్సాస్ జడ్జి రేసులో ఎన్ఆర్ఐ
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జడ్జి పదవికి భారతీయ అమెరికన్ అటార్నీ షంపా ముఖర్జీ పోటీపడుతున్నారు. టెక్సాస్లోని హారీస్ కౌంటీకి చెందిన 269వ సివిల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు ఆమె తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు. దేశంలోని సివిల్ కోర్టులకు ఎన్నో సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే తాను ఆ జడ్జి సీటుకు పోటీపడుతున్నానని డెమోక్రటిక్ అభ్యర్థి అయిన ఆమె చెప్పారు. అందరికీ కోర్టుల అందుబాటు, జ్యూరీ విచారణ హక్కును కల్పించే 7వ సవరణను తాను విశ్వసిస్తున్నాను అని ఆమె ఈ సందర్భంగా అన్నారు.
పార్టీ పైమరీల తొలి ఓటింగ్ ఫిబ్రవరి 20న జరిగింది. ఎన్నిక రేపు (మంగళవారం ) జరగనుంది. ప్రైమరీలో గెలిచిన అభ్యర్థి తదుపరి అధికారంలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి, జడ్జి డాన్ హిందెతో తలపడతారు. హౌస్టన్కు చెందిన షంపా ముఖర్జీ 1960 దశకంలో అమెరికాకు వలసపోయిన భారతీయ దంపతుల కూతురు. అమె తండ్రి అమెరికాలోని ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో ఇంజినీర్గా పనిచేశారు. రిటైర్ అయ్యాక అయన ఫిలాసఫీలో డాక్టరేట్ చేశారు. గ్రాడ్యుయేట్ అయిన ఆమె తల్లి గృహిణిగా బాధ్యతలు నిర్వహించి తన ముగ్గురు సంతానాన్ని పెంచి పోషించింది. షంపా ముఖర్జీ యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్ లా సెంటర్ స్కూల్లో లా చదివారు. చుదువుకునే రోజుల్లోనే అమె హూస్టన్ జర్నల్ ఆఫ్ హెల్త్ లా అండ్ పాలసీ అనే పత్రిక సంపాదకురాలిగా పనిచేశారు.













