అంగరంగ వైభవంగా టిఎస్ఆర్, టివి 9 అవార్డుల ప్రదానోత్సవం
కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ సినీ అవార్డుల కార్యక్రమం విశాఖపట్టణంలో జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమ తరలివచ్చింది. అగ్రకథా నాయకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు సహా ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అలనాటి బాలీవుడ్ అందాల తార హేమమాలిని, ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహరి, బ్రహ్మానందం, నాని తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బప్పి లహరికి జీవితకాల సాఫల్య పుస్కారం అందజేశారు. ఇక హేమమాలిని మిలీనియం కథానాయకి అవార్డును అందుకున్నారు. 2015కి గానూ ఉత్తమ నటుడు అవార్డును వెంకటేష్ అందుకున్నారు. 2016కి గానీ ఉత్తమ కథానాయకుడి అవార్డు బాలకృష్ణకు అందజేశారు.
నాగార్జున 2016 ఉత్తమ నటుడు అవార్డ్, మోహన్ బాబుకి 4 డికెడ్స్ స్టార్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఉత్తరాది, దక్షిణాది తారలను ఒకే వేదికపై ఘనంగా సత్కరించడం ఒక్క సుబ్బిరామిరెడ్డి గారికే సాధ్యం అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి అవార్డులు మరిన్ని మంచి చిత్రాలను చేయాలనే స్ఫూర్తిని అందిస్తాయి అన్నారు. నాగార్జున మాట్లాడుతూ బాలకృష్ణకు నాకు పడడం లేదని వార్తలు వచ్చాయి. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మా మధ్య స్నేహం లేదని వస్తున్న రూమర్లలో నిజం లేదు అన్నారు.













