మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి, ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ #చిరుబాబీ2 / #చిరు158 రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభం, స్పెషల్ వీడియో రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో #ChiruBobby2 / #Chiru158 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పలు భాషల్లో భారీ విజయాలు అందుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్కు ఇది తొలి తెలుగు చిత్రం కావడం విశేషం.
నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మేకర్స్ ప్రకటించినట్లుగానే నేడు హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలి షెడ్యూల్లో చిరంజీవి, అనస్వర రాజన్లపై కీలక టాకీ పార్ట్ను చిత్రీకరిస్తున్నారు. కథలో ఈ సన్నివేశాలుచాలా కీలకంగా ఉండబోతున్నాయి.
ఈ సందర్భంగా చిత్రబృందం బీటీఎస్ వీడియోను విడుదల చేసింది. ఇందులో సినిమా ప్రధాన సాంకేతిక బృందాన్ని పరిచయం చేశారు. వీడియోలో ఉత్సాహంగా కనిపించిన చిరంజీవి, “లెట్స్ సెట్ ది బ్లడీ బెంచ్మార్క్” అంటూ సందడి చేశారు. అనంతరం దర్శకుడు బాబీని సినిమా టైటిల్ గురించి అడగగా, ఆయన దాటవేయడానికి ప్రయత్నించారు. దానికి చిరంజీవి సరదాగా స్పందిస్తూ, “సరైన సమయంలో నేనే టైటిల్ లీక్ చేస్తానేమో” అంటూ చమత్కరించారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
దర్శకుడు బాబీ కొల్లి మరింత భారీ స్థాయిలో కథను సిద్ధం చేశారు. దశాబ్దాలుగా తన స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి ఈ చిత్రంలో తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన మరోసారి అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. అలాగే అనస్వర రాజన్ కూడా మెగాస్టార్తో కలిసి నటించబోతుండటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్కు టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ చిత్రానికి అద్భుతమైన విజువల్స్ అందించనున్నారు. ప్రొడక్షన్ డిజైన్ అవినాశ్ కొల్లా నిర్వహిస్తుండగా, ఎడిటింగ్ను ఆంటోని ఎల్. రూబెన్ చేస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్ప్లే అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి ఆడిషినల్ స్క్రీన్ప్లే రచయితలుగా పనిచేస్తున్నారు. భాను–నందు ద్వయం సంభాషణలను అందిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికతో పాటు ఇతర ప్రధాన తారాగణానికి సంబంధించిన వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.







