ఏపీలో క్వాంటం ఇంక్యుబేటర్ ప్రారంభం : మన్నవ మోహన కృష్ణ
ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ సాంకేతిక రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా తొలి క్వాంటం ఇంక్యుబేటర్ (First Quantum Incubator)ను మేధా టవర్స్లో ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ (Mannava Mohana Krishna), చండీగఢ్ యూనివర్సిటీ ఎండీ జై ఇందర్ సింగ్ సందు (Jai Inder Singh Sandhu), క్వాంటం వ్యాలీ డైరెక్టర్ శ్రీధర్ (Sridhar) ప్రారంభించారు. అనంతరం ఛండీఘర్ యూనివర్సిటీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ (సీయూబీఐసీ) తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మయూరి టెక్ లో మన్నవ మోహన కృష్ణ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా క్వాంటం టెక్నాలజీ, పరిశోధన, స్టార్టప్ల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, ఇంక్యుబేషన్ కార్యక్రమాల్లో పరస్పర సహకారానికి మార్గం సుగమం కానుంది. ఈ సందర్భంగా మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ ఆవిష్కరణలు, స్టార్టప్ల ప్రోత్సాహంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఛండీఘర్ యూనివర్సిటీ తో భాగస్వామ్యం రాష్ట్ర యువతకు సువర్ణావకాశాలను అందిస్తుందని తెలిపారు. క్వాంటం ఇంక్యుబేటర్ ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లకు ప్రపంచ స్థాయి మెంటారింగ్, అత్యాధునిక క్వాంటం కంప్యూటింగ్ వనరులు, పరిశ్రమలతో అనుసంధానం, పెట్టుబడిదారులతో భాగస్వామ్య అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టి, ఐటీ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ఏపీని క్వాంటం, డీప్టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
క్వాంటం వ్యాలీ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ క్వాంటం టెక్నాలజీ భవిష్యత్ ప్రపంచాన్ని నిర్దేశించే విప్లవాత్మక రంగమని, ఈ అవకాశాలను రాష్ట్ర యువత సద్వినియోగం చేసుకుని ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో ధాత్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








