బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నాకు పునర్జన ఇచ్చింది
కొక్కిలగడ్డలో మంత్రి నారా లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మహిళ
కొక్కిలగడ్డ: క్యానర్స్ తో పోరాడుతున్న ఎంతోమంది నిరుపేదలకు అండగా నిలిచి వారి ప్రాణాలు నిలిపింది బసవతారకం ఆసుపత్రి. క్యాన్సర్ బాధితులకు బసవతారకం ఆసుపత్రి ఓ భరోసా అని మరోసారి నిరూపితమైంది. ప్రాణాంతక క్యాన్సర్ తో పోరాడుతున్న తనకు హైదరాబాద్ లోని బసవతారకం ఇండో- అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పునర్జన ఇచ్చిందని కొల్లి దమయంతి అనే మహిళ మంత్రి నారా లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, కొక్కిలగడ్డలో జడ్పీ స్కూల్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి నారా లోకేష్ ను కొక్కిలగడ్డ గ్రామానికి చెందిన 60 ఏళ్ల కొల్లి దమయంతి కలిశారు. క్యాన్సర్ వ్యాధిబారిన పడిన తాను రెండేళ్ల క్రితం హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నానని మంత్రికి వివరించారు. నాణ్యమైన వైద్యసేవలు తక్కువ ఖర్చుతో అందించారని.. అక్కడి వైద్యులు, సిబ్బంది తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని ప్రస్తుతం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నానని ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ.. బాలయ్య మావయ్య ఆధ్వర్యంలో బసవతారకం ఆసుపత్రిని సమర్థంగా నిర్వహిస్తున్నారని, ఎంతోమంది పేదలకు అండగా నిలిచిందన్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని సదరు మహిళకు సూచించారు.








