జనగణనలో పాల్గొందాం : మన్ కీ బాత్ వేదికగా ప్రధాని పిలుపు
ప్రస్తుతం దేశవ్యాప్తంవగా జరుగుతున్న జనాభా లెక్కల ప్రక్రియ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, పౌరులందరిదీ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.ఆదివారం మన్ కీ బాత్ 133 వ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రతి ఒక్కరు కూడా జనగణనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని పూర్తిగా సురక్షితంగా, గోప్యంగా వుంచుతామని హామీ ఇచ్చారు. భారత జనాభా లెక్కల ప్రక్రియలోనే అతిపెద్దదని, 2027 జనాభా లెక్కల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది మొబైల్ యాప్ ద్వారా ప్రజల వివరాలు నమోదు చేస్తారని, తమ సమాచారాన్ని స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నామని తెలిపారు. నమోదు చేసుకోవడానికి వచ్చే అధికారుల రాకకు 15 రోజుల ముందు ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు.
ఈ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే ఓ ప్రత్యేకమైన ఐడీ లభిస్తుందని, ఈ ఐడీ మొబైల్ ఫోన్ కి లేదా, ఈమెయిల్ కి పంపిస్తారన్నారు. లెక్కల సేకరణ సమయంలో ఇంటికి వచ్చే వారికి ఈ ఐడీ చూపించడం ద్వారా వివరాలను సరి చూసుకోవచ్చని, దీని వల్ల సమాచారాన్ని మళ్లీ అందించాల్సిన అవసరం వుండనే వుండదని మోదీ సూచించారు.
ఇక.. మన్ కీ బాత్ లో పవన శక్తి ఉత్పత్తిలోనూ భారత్ మరో మైలురాయి దాటిందన్నారు. దేశం ముందుకు వెళ్లాలంటే సౌర, పవన శక్తులు చాలా ముఖ్యమన్నారు. పునరుత్పాదక విద్యుత్ వల్ల భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా వుంటుందని, పనవ శక్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నాలుగో స్థానంలో వుందన్నారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 56 గిగావాట్లకు పైగా పవన శక్తిని ఉత్పత్తి చేస్తున్నామని, గత యేడాదితో పోలిస్తే 6 గిగావాట్ల పవన శక్తి అదనంగా ఉత్పత్తి అవుతోందన్నారు.
అలాగే అణుశక్తి పరిశోధనల్లో భారత్ మరో అడుగు వేసిందని కల్పక్కంలో విషయాన్ని గుర్తు చేశారు. తమిళనాడులోని కల్పక్కంలో వున్న 500 మెగావాట్ల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ దేశ దీర్ఘకాలిక అణు వ్యూహంలో ఓ మూలస్తంభం అని కొనియాడారు. ఈ విషయంలో మన అణు శాస్త్రవేత్తలు విజయాన్ని సాధించి, దేశానికి గొప్ప పేరు తీసుకొచ్చారన్నారు. ఈ అణు రియాక్టర్ ను పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో నిర్మించడం విశేషమని మోదీ అన్నారు.








