మలేషియా లో ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారికి విజ్ఞప్తి.. అమ్నెస్టీ ప్రోగ్రామ్ ముగిసేందుకు మిగిలింది కొన్ని రోజులే
Malaysia: ఫెడరేషన్ ఆఫ్ NRI కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా (FNCA-మలేషియా) మలేషియాలో ఏజెంట్ల మోసాలకు గురై అక్రమంగా నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కి చెందిన తెలుగు కార్మికులకు అత్యవసర విజ్ఞప్తి చేసింది. మలేషియా ప్రభుత్వం తీసుకువచ్చిన PRM 2.0 (Program Repatriasi Migran 2.0) అమ్నెస్టీ కార్యక్రమం ముగిసేందుకు ఇక మరో 15 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 30 న ముగుస్తుంది. ఈ PRM 2.0 డాక్యుమెంట్లు లేని ఓవర్స్టే అయిన విదేశీ కార్మికులకు తమ నివాసాన్ని చట్టబద్ధం చేసుకోవడానికి లేదా ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా సురక్షితంగా స్వదేశం వెళ్లడానికి చివరి అవకాశం అని FNCA-మలేషియా స్పష్టం చేసింది. “చాలా కాలంగా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న తెలుగు కార్మికులు భయం లేకుండా, గౌరవంగా స్వదేశం తిరిగి వెళ్లడానికి ఇది సువర్ణ అవకాశం. కానీ గడువు ముగిసే లోగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నిర్బంధం, భారీ జరిమానాలు జైలు శిక్ష వంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుంది” అని FNCA-మలేషియా అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు.
వారంలోగా టికెట్ కొనుగోలు చేయాలి..
ఈ అమ్నెస్టీ కార్యక్రమం ద్వారా స్వదేశం వెళ్లే కార్మికులు 500 మలేషియా రింగ్గిట్ (సుమారు రూ.10,000) చెలించాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్టు ఉన్నవారు పాస్పోర్టు, లేనివారు ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్ స్వయంగా వారం రోజుల్లోగా వెళ్లేందుకు విమాన టికెట్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. FNCA-మలేషియా, ఇతర తెలుగు NRI సంఘాలు ప్రభావిత కార్మికులకు అప్లికేషన్ ప్రక్రియలో పూర్తి మార్గదర్శకత్వం డాక్యుమెంటేషన్ సహాయం అందిస్తున్నాయి. కార్మికులు ఎలాంటి ఆలస్యం చేయకుండా తక్షణం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బలంగా సూచిస్తున్నారు. ఈ అమ్నెస్టీ సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సహాయం కావాల్సినవారు FNCA-మలేషియా లేదా స్థానిక NRI సంఘాలను తక్షణం సంప్రదించాలని కోరడమైనది.
ఇవి కూడా చదవండి








