నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన
మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
మంగళగిరి: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృషితో మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. మంగళగిరి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. నంబూరు-మంగళగిరి సెక్షన్ మార్గంలో మంగళగిరి-నిడమర్రు మార్గంలో 14వ నెంబర్ రైల్వే లెవల్ క్రాసింగ్ గేటు స్థానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణ పనులకు ఈ ఉదయం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా మంగళగిరి-నిడమర్రు రోడ్డు వద్దకు చేరుకున్న మంత్రి లోకేష్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ లకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.
రూ.142 కోట్ల వ్యయంతో ఆర్వోబీ నిర్మాణం
మంగళగిరి నుంచి రాజధాని అమరావతికి, తాడికొండ నియోజకవర్గానికి అనుసంధానంగా నిడమర్రు రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద రూ.142 కోట్ల వ్యయంతో ఆర్వోబీని నిర్మించనున్నారు. దశాబ్దాలుగా ఈ మార్గంలో రైల్వే లెవల్ క్రాసింగ్ వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో మంత్రి లోకేష్ చొరవ తీసుకుని రైల్వే లెవల్ క్రాసింగ్ పై ఆర్వోబీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు చేయించారు.
ఇవి కూడా చదవండి
సమస్య శాశ్వత పరిష్కారంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరుకు కృషిచేశారు. ఆర్వోబీ నిర్మాణం పూర్తయితే నిడమర్రు, మంగళగిరి, తాడికొండ, అమరావతి ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయి. ప్రజా రాజధాని అమరావతికి సులభమైన, నిరంతరాయ రవాణ అనుసంధానాన్ని కల్పిస్తుంది. మంగళగిరి, అమరావతి మధ్య ప్రయాణ దూరం తగ్గుతుంది. మంగళగిరి పట్టణం నుంచి మంగళగిరి నియోజకవర్గంలోని బేతపూడి, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ గ్రామాల ప్రజలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. భవిష్యత్ లో ఈ ప్రాంతంలో పట్టణీకరణ, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. రైల్వే క్రాసింగ్ గేటు ద్వారా రోజుకు సుమారు 60 రైళ్లు ప్రయాణిస్తాయి. రోజుకు రహదారి రాకపోకల కోసం గేటు మూసివేసే సగటు వ్యవధి 8 నుంచి 10 గంటలుగా ఉంది. లెవల్ క్రాసింగ్ గేటు మూసివేసిన సమయంలో ప్రయాణీకులు దాటేందుకు 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టేది. ఆర్వోబీ నిర్మాణంతో సుమారు నిమిషంలోనే దాటే అవకాశం ఉంది.
నిడమర్రు రైల్వే లెవల్ క్రాసింగ్ పై ఆర్వోబీ రైల్వే లైన్ పై 10 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. దీని పొడవు 767.50 మీటర్లు. ఇందులో రైల్వే లైన్ నుంచి అమరావతి వైపు 362 మీటర్లు, మంగళగిరి వైపు 405.50 మీటర్లు నిర్మాణం చేపట్టనున్నారు. వంతెనపై నాలుగు లైన్లు రహదారి ఏర్పాటుచేయనున్నారు. ప్రతి లైను 3.75 మీటర్లు కాగా మొత్తం క్యారేజ్ వే వెడల్పు 15 మీటర్లు ఉంటుంది. అదనంగా 0.45 మీటర్లు చొప్పున రెండు వైపులా క్రాష్ బ్యారియర్లు, 0.45 మీటర్లు మధ్య డివైడర్ నిర్మించనున్నారు. సర్వీసు రోడ్లు డ్రైన్లతో కలిపి రెండు వైపులా 11 మీటర్లు(5.5*2) 5.5 మీటర్ల వెడల్పుతో ఏర్పాటుచేయనున్నారు. సర్వీస్ రోడ్లతో సహా ఆర్వోబీ మొత్తం వెడల్పు 28 మీటర్లు ఉండనుంది.
ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, మండల పార్టీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.








