కోలీవుడ్ డైరెక్టర్ తో నవీన్ నెక్ట్స్ మూవీ?
కొంతకాలం పాటు వెండితెరకు దూరంగా ఉన్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen polishgetty) ఇప్పుడు తన తర్వాతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. టాలీవుడ్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, తమిళ డైరెక్టర్ ఆంటోనీ భాగ్యరాజ్(Anthony Bhagyaraj) దర్శకత్వంలో నవీన్ కొత్త సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మించనుండగా, అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్పై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
ఆంటోనీ భాగ్యరాజ్ గతంలో జయం రవి(jayam ravi), కీర్తి సురేష్(keerthy suresh) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సైరన్(Siron) సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. అంతకుముందు విశ్వాసం(Viswasam), హీరో(Hero) వంటి కమర్షియల్ సినిమాలకు స్టోరీ రైటర్ గా పనిచేసి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్ అంశాలను వినోదాత్మకంగా మేళవించే ఆయన శైలి నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్తో కలిస్తే కొత్త తరహా ఎంటర్టైనర్ వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హీరోగా నవీన్ పోలిశెట్టి ఇప్పటివరకు మంచి సక్సెస్లనే అందుకున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ(Agent Sai Srinivasa athreya), జాతిరత్నాలు(Jathiratnalu), మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన అనగనగా ఒక రాజు(Anangana oka raju)తో మరో కమర్షియల్ హిట్ను తన అకౌంట్ లో వేసుకున్నాడు. ఒకేసారి ఒకే సినిమాపై దృష్టి పెట్టే నవీన్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించనున్నట్లు సమాచారం.








