రాయలసీమలో ఇంటిగ్రేటెడ్ సోలార్ హబ్ ఏర్పాటుచేయండి : మంత్రి లోకేష్
విక్రమ్ సోలార్ సిఈఓ అరుణ్ మిట్టల్, ఎండి జ్జానేష్ చౌదరిని కోరిన మంత్రి లోకేష్
కోల్ కత్తా: విక్రమ్ సోలార్ చైర్మన్ & ఎండి జ్జానేష్ చౌదరి, సిఇఓ అరుణ్ మిట్టల్ తో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్ కతాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చాలన్న లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని ప్రకటించాం. రాబోయే ఐదేళ్లలో పునరుత్పాదక ఇంధన (రెన్యువబుల్ ఎనర్జీ) రంగంలో దాదాపు 78.5 గిగావాట్ల భారీ సామర్థ్యాన్ని సాధించడానికి ప్రణాళికలు రూపొందించాం. పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 7.5 లక్షల ఉద్యోగాలను సృష్టించడం తమ ధ్యేయమని చెప్పారు. రిలయన్స్ ఏర్పాటుచేయబోయే 5వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్, SAEL యొక్క 600 మెగావాట్ల ప్లాంట్ వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో సౌర విద్యుత్ సామర్థ్యానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన రంగానికి అందిస్తున్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకొని విక్రమ్ సోలార్ లిమిటెడ్ (VSL) పవర్హైవ్ స్టోరేజ్ విస్తరణతో పాటుగా ఇంటిగ్రేటెడ్ సోలార్ హబ్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.








