శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ ఛైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ ఈవెంట్ లో అతిథిగా పాల్గొన్న విజయ్ దేవరకొండ
పేద పిల్లలకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు, వైద్య సహాయం అందిస్తూ గొప్ప సేవ చేస్తోంది శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్స్. ఈ ఆస్పత్రి విజయవంతంగా 500 సర్జరీలు, ఇంటర్వెన్షన్స్ పూర్తి చేసిన సందర్భంగా సిద్ధిపేట జిల్లాలోని కొండపాకలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు, స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఛైర్మన్ డా. శ్రీనివాస్ మాట్లాడుతూ – శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్స్ సిద్ధిపేటకు వచ్చేందుకు ఒకే ఒక కారణం సోదరుడు హరీశ్ రావు. ఆయన సంకల్పం, పట్టుదల వల్లే ఇక్కడ ఆస్పత్రి స్థాపించగలిగాం. విజయ్ దేవరకొండ ఈరోజు దేశమంతటిలో గుర్తింపు సంపాదించారు. ఆయన మా కార్యక్రమానికి అతిథిగా రావడం సంతోషంగా ఉంది. సత్యసాయి వారి కృప కటాక్షాలు ఎప్పుడూ మనపై ఉంటాయి. ఈ రోజు ఈ ఆస్పత్రి ద్వారా పిల్లలకు 500 సర్జరీలు విజయవంతంగా చేయగలిగాం అంటే అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది. ప్రాణం పోసేది ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే మనతో ఇదంతా చేయిస్తున్నాడు. మా వైద్యులు, ఇతర వైద్య బృందం కృషిని అభినందిస్తున్నా. సిద్ధిపేట మొత్తానికి మా ఆస్పత్రి మకుటంలా నిలుస్తుంది. అన్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ – ఈ రోజు ఈ గొప్ప కార్యక్రమంలో అతిథిగా పాల్గొనడం సంతోషంగా ఉంది. తెలంగాణ హీరోయిజాన్ని, స్టామినాను ప్రపంచానికి చాటిన మన హీరో, తెలంగాణ ముద్దుబిడ్డ విజయ్ దేవరకొండ అతిథిగా వచ్చారు. శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్స్ ఒక ఆస్పత్రి మాత్రమే కాదు నా దృష్టిలో ఇదొక దేవాలయం. మా డా. శ్రీనివాస్ గారు ఒక దేవుడు. మీ వైద్యులంతా పిల్లలకు 500 సర్జరీలు చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించిన దేవుళ్లు. ఈ ఆస్పత్రికి ఇక్కడికి వచ్చేందుకు నావంతు కృషి చేశాను. ఈ ఆస్పత్రి మరింతగా అభివృద్ధి చెందాలి. మా వంతు సహకారం ఎప్పుడూ శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్స్ కి అందిస్తాం. అన్నారు.

స్టార్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – నేను ఆరేళ్ల వయసు నుంచి సత్యసాయి స్కూల్ లో చదువుకున్నా. ఆ చదువు పంచిన జ్ఞానం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండగలిగాను. సత్యసాయి పుట్టపర్తిలో పుట్టి దేవుడిగా ప్రజల ప్రేమను పొంది ఉచితంగా చదువులు చెప్పాలనే గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన ప్రజల మీద ప్రేమతో ఆయన ఒక్కరు తీసుకున్న ఈ నిర్ణయం నాలాంటి ఎంతోమంది జీవితాలను మార్చింది. ఈ రోజు డా. శ్రీనివాస్ గారు వాళ్ల తల్లి మాట మీద అనేక చోట్ల సంజీవని ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఒక ఖరీదైన కార్పొరేట్ ఆస్పత్రిలా ఈ ఆస్పత్రిని నిర్వహించడం గొప్ప విషయం. శ్రీనివాస్ గారు చేస్తున్న సేవ కంటే, ఇక్కడి వైద్యులు, వైద్య బృందం చేస్తున్న సేవ కంటే ఇంకా గొప్పది ఏముంటుంది. మీరు చేస్తున్నది అక్షరాలా దేవుడి సేవే. ప్రతి ఒక్కరూ మీ సేవను గుర్తుంచుకుంటారు. ఇక్కడ సహాయం పొంది, చికిత్స చేయించుకున్న పిల్లలు రేపు గొప్ప స్థాయికి వెళ్లబోతున్నారు, ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపబోతున్నారు. ఒక అబ్బాయిని అడిగితే నేవికి వెళ్లి దేశానికి సేవ చేస్తా అన్నారు. అలా ఈ పిల్లలంతా మన సమాజానికి దేశానికి గొప్ప పేరు తీసుకురావాలి. ఈ ఆస్పత్రి కార్యక్రమంలో అతిథిగా పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా. మీ సేవలకు దేశవ్యాప్తంగా ఎంతోమంది అండగా నిలబడతారు. అన్నారు.








