NJ: న్యూజెర్సిలో వికసిత భారత్ రన్ విజయవంతం..

సాయిదత్త పీఠంతో పాటు పలు సంస్థల మద్దతు
ప్రవాస భారతీయులంతా వికసిత్ భారత్ రన్ (Viksit Bharat Run) లో కలిసి అడుగులు వేసి జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టారు. భారతీయ అమెరికన్ కమ్యూనిటీ, న్యూయార్క్ నగరంలోని భారత కాన్సులేట్ జనరల్ మద్దతుతో న్యూజెర్సీలోని శ్రీ శివ విష్ణు ఆలయం సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ రన్కు అద్భుతమైన స్పందన లభించింది. మన భారతీయ ఐక్యత, ప్రగతిని వికసిత భారత్ రన్ ద్వారా ప్రదర్శించారు. ఎడిసన్లోని ఓక్ ట్రీ సాయి దత్త పీఠం పార్కింగ్ నుండి ఈ రన్ ప్రారంభమైంది. మన మాతృభూమి సాధించిన అద్భుత ప్రగతిని, ముఖ్యంగా 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా భారతదేశం సాగిస్తున్న చారిత్రక ప్రయాణాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా జరిగిన ఈ పరుగులో ప్రవాస భారతీయుల ఉత్సాహం పరవళ్లు తొక్కింది. భారత్-అమెరికా మైత్రిని మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ రన్ ఒక వేదికగా మారింది.
ఈ కార్యక్రమానికి న్యూయార్క్ నుండి డిప్యూటీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా విశాల్ జయేష్ భాయ్ హర్ష్, న్యూజెర్సీ మాజీ డిప్యూటీ స్పీకర్, కమీషనర్ ఎమిరిటస్ ఉపేంద్ర చివుకుల, సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు మందిరం చైర్మన్ రఘుశర్మ శంకరమంచి, కమ్యూనిటీ లీడర్స్ కృష్ణా రెడ్డి అనుగుల, విలాస్ జంబుల, దాము గేదెల, తానా, ఆట, నాట్స్, టీటీఏ, మాటా, టీఫాస్, హెచ్ ఎస్ ఎస్, ఇండో అమెరికన్ సంస్థ తో పాటు, పలు స్థానిక, జాతీయ ప్రవాస భారతీయ సంస్థలను కలుపుకుని సాయిదత్త పీఠం ఈ రన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.
విశాల్ హర్ష్, కృష్ణా రెడ్డి, ఉపేంద్ర, గోపి ఆచంట, మోహన్ దేవరకొండ, శ్రీనివాస్ భర్తవరపు, శ్రీహరి మందాడి, సంతోష్ కోరం, కిరణ్ దుద్దిగ, శ్రీకాంత్, అశ్విన్ గోస్వామి, కల్పనా శుక్లా తదితరులు మాట్లాడుతూ .. భారత అభివృద్ధి దిశ మరియు 30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు ప్రయాణం, ఫిట్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, మేక్-ఇన్-ఇండియా కార్యక్రమాలు సాంకేతిక ప్రగతి (డిజిటల్ ఇండియా -యుపిఐ), భారత్ – అమెరికా స్నేహంపై దృష్టి, వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రవాస భారతీయుల (డయాస్పోరా) సహకారం వంటి పలు అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎంతగానో శ్లాఘించారు. వికసిత భారత్ లో ప్రవాస భారతీయుల పాత్ర ఎంత కీలకం అనేది ఈ రన్ ద్వారా చాటి చెప్పింది. ఈ సందర్భంగా విశాల్ హర్ష్ దేవాలయ ప్రాంగణం లోని పూదోట లో ఒక ఎవర్గ్రీన్ మొక్కను కూడా నాటారు. ఈ కార్యక్రమానికి పలువురు మహిళలు కూడా విచ్చేశారు.
సాయి దత్త పీఠం ఉదయాన్నే అందరికీ అల్పాహారాన్ని అందించింది. వికసిత్ భారత్ టీ-షర్ట్స్ ను కూడా నిర్వాహకులు అందించారు. ప్రీతి, నీలిమ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.