అమెరికా కోర్టు సంచలన తీర్పు
అమెరికాలో మూడేళ్ల క్రితం అయిదుగురు పాత్రికేయులను దారుణంగా కాల్చిచంపిన హంతకుడు కేసులో అమెరికా కోర్టు చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. జీవిత కాలంలో ఎట్టిపరిస్థితుల్లోనూ జైలు నుంచి విడుదల కాకుండా కఠిన శిక్షలు విధించింది. అయిదు యావజ్జీవ శిక్షణతో పాటు మరో 345 ఏళ్లు కారాగారంలోనే ఉంచాలని ఆదేశించింది. స్వల్ప కాలం జైలు బయటకు అనుమతించే పెరోల్ వంటి సదుపాయాన్ని కూడా హంతకుడికి కల్పించవద్దని స్పష్టం చేస్తూ అన్నె అరండెల్ కౌంటీ జడ్జి మైఖేల్ వాష్ తీర్పునిచ్చారు. మేరిల్యాండ్లోని క్యాపిటల్ గజేట్ అనే స్థానిక పత్రిక కార్యాలయంపై 2018 జూన్లో జరోడ్ రేమోస్ అనే దుండుగుడు దాడి చేశాడు. న్యూస్ రూమ్లోకి దూసుకెళ్లి విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో అయిదుగురు పాత్రికేయులు మృతి చెందారు.
జర్నలిస్టులపై అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటిగా ఈ ఘటన నిలిచింది. గతంలో తాను పాల్పడిన ఓ నేరానికి సంబంధించిన వివరాలను పత్రికలో ప్రచురించారనే ఆగ్రహంతో హంతకుడు పాత్రికేయులను హత్య చేసినట్లు తెలుస్తోంది. తీర్పును వెలువరించడానికి ముందు మృతుల కుటుంబ సభ్యల ఆవేదనను, వారు పడిన కష్టాలను న్యాయమూర్తి విన్నారు.






