Washington: ముగిసిన అమెరికా షట్ డౌన్… నెగ్గిన ట్రంప్ పంతం..
సుదీర్ఘంగా సాగిన అమెరికా షట్ డౌన్ ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. ఫెడరల్ కార్యకలాపాలకు తాత్కాలికంగా నిధులు కేటాయించే బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేశారు. డెమొక్రాట్లు పట్టుబట్టిన ఒబామాకేర్ సబ్సిడీల డిమాండ్ను … అధ్యక్షుడు ఆమోదించలేదు. అయినా సరే ఈ బిల్లు ఆమోదం పొందడం రిపబ్లికన్లకు రాజకీయ విజయంగా చెప్పవచ్చు.
బుధవారం సెనేట్ ఆమోదించిన ఈ బిల్లును ప్రతినిధుల సభ కూడా ఆమోదించడంతో ప్రతిష్టంభన వీడింది. సెనేట్లో బిల్లు ఆమోదం పొందాలంటే 60 ఓట్లు అవసరం కాగా, రిపబ్లికన్లకు ఆ సంఖ్యాబలం లేదు. అయితే, 8 మంది డెమొక్రాట్లు పార్టీ వైఖరికి వ్యతిరేకంగా రిపబ్లికన్లతో కలిసి అనుకూలంగా ఓటు వేయడంతో బిల్లు పాసయ్యేందుకు మార్గం సుగమమైంది. ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు 222-209 ఓట్ల తేడాతో ఆమోదం లభించింది.
తిరిగి ప్రారంభం కానున్న ప్రభుత్వ కార్యకలాపాలు
ఈ నిర్ణయంతో విమాన ప్రయాణాలు, పేదలకు ఆహార సబ్సిడీ సహా నిలిచిపోయిన అన్ని ఫెడరల్ సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే, అన్ని కార్యకలాపాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. షట్డౌన్ సమయంలో పని చేయని, వేతనం లేకుండా పనిచేసిన ఫెడరల్ ఉద్యోగులందరికీ వారి బకాయి జీతాలు అందనున్నాయి.
బిల్లుపై సంతకం చేసిన అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ఇది ఒక గొప్ప రోజు అని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరిగే కాంగ్రెస్ ఎన్నికల్లో ఈ షట్డౌన్ను ప్రజలు మర్చిపోవద్దని ఆయన సూచించారు. అయితే, డెమొక్రాట్లు కూడా దీటుగా స్పందించారు. ప్రతినిధుల సభలో డెమొక్రాటిక్ నేత హకీమ్ జెఫ్రీస్ మాట్లాడుతూ, “ఈ ఏడాదైనా రిపబ్లికన్లు ఒబామాకేర్ ట్యాక్స్ క్రెడిట్లను పొడిగించాలి. లేదంటే వచ్చే ఏడాది ఎన్నికల్లో అమెరికా ప్రజలు వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారు” అని హెచ్చరించారు.
తాజా చట్టం ప్రకారం చాలా ప్రభుత్వ కార్యకలాపాలకు ఈ ఏడాది చివరి వరకు నిధులు అందుతాయి. సైనిక సిబ్బందికి పదవీ విరమణ సేవలు, పేదలకు ఆహార కార్యక్రమాలు వంటి కొన్ని పథకాలకు సెప్టెంబర్ వరకు నిధులు కొనసాగుతాయి. ఇదిలా ఉండగా, ఈ బిల్లులో సెనేటర్ల ఫోన్ రికార్డులకు సంబంధించిన ఒక అసాధారణ నిబంధనను రహస్యంగా చేర్చారు. దీని ప్రకారం ఫెడరల్ ప్రాసిక్యూటర్లు సెనేటర్లకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా వారి ఫోన్ రికార్డులను శోధించడం చట్టవిరుద్ధం. ఈ నిబంధన 2022 నుంచి వర్తిస్తుంది.






