Chandrababu:ఇదో గొప్ప ఆదర్శం…ఎన్నో మార్పులకు నాంది: చంద్రబాబు
పరోపకారం పరమో ధర్మ అనేది మన భారతీయ ధర్మమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎదుటివారికి, సమాజానికి సేవ చేయడం మన సంస్కృతిలో భాగమని, అందుకే మనది పుణ్యభూమి అయ్యిందని చెప్పారు. మనం బాగుండాలి, మనతో పాటు నలుగురు బాగుండాలని నాడు జన్మభూమి కార్యక్రమం చేపట్టి సమాజంలో మార్పునకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో నేడు జీరో పావర్టీ(Zero Poverty) పీ-4 కార్యక్రమాన్ని తలపెట్టామని, దీనికి వస్తున్న స్పందన ఎంతో సంతృప్తినిస్తోందని వెల్డలించారు. ఇటీవల ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తల తిరుమల వేంకటేశ్వరస్వామికి 121 కిలోల బంగారం విరాళం(Gold donation)గా ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, భూరి విరాళాలు టీటీడీ (TTD) చేపట్టే విద్య, వైద్యం వంటి సేవలకు ఎంతో ఉపకరిస్తుందని, ఎన్నో సత్కార్యాలకు దోహద పడుతుందన్నారు. డబ్బు సంపాదన కంటే దాన్ని తిరిగి సమాజంపై ఖర్చు చేయడమే ఎక్కువ తృప్తిని, నిజమైన సంతోషాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదని చెప్పారు. సమాజంలో సంపద సృష్టించిన ప్రతి ఒక్కరూ మంచి మనసుతో తిరిగి సమాజం కోసం వెచ్చించేందుకు ముందుకు రావాలని కోరారు. ఇదో గొప్ప ఆదర్శంగా నిలిచి ఎన్నో మార్పులకు నాంది పలకాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.







