మీ వారూ ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు గుర్తుంచుకోండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్న వీసాల బిల్లుపై చర్చలు జరుపుతున్నా ఫలితం లేకపోవడం, అమెరికా దూకుడుగానే వెళుతుండటంతో భారత్ గట్టి హెచ్చరికలు చేసింది. ఎన్నో యూఎస్ కంపెనీలు ఇండియాలో వ్యాపారం చేస్తున్నాయని, ఆ విషయాన్ని అమెరికా అధికారులు గుర్తుంచుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. కేవలం ఇండియన్ కంపెనీలు మాత్రమే యూఎస్లో ఉన్నాయని భావించవద్దని, ఎన్నో పెద్ద అమెరికా కంపెనీలు ఇండియాలో వ్యాపారం చేస్తూ భారీ ఆదాయాన్ని పొందుతున్నాయని ఆమె గుర్తు చేశారు. ఇక్కడి ఆదాయాన్ని యూఎస్ కంపెనీలు, తమ ఆర్థిక వ్యవస్థకు తీసుకెళుతున్నాయని, ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కారణంగా ఇండియా కంపెనీలతో పాటు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్న అమెరికా కంపెనీలపైనా ఆ ప్రభావం ఉంటుందని అన్నారు. వీసా నిబంధనలు కొనసాగితే, తాము తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, అన్ని అంశాలనూ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అమెరికా ధోరణి అన్యాయమని, నిబంధనల మార్పుుపై ఐటీ కంపెనీల భయాందోళలను యూఎస్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని తెలిపారు.
