కరోనా చికిత్సకు రోజుకు రూ.లక్ష చొప్పున ఇవ్వాల్సిందే…
సర్కారు ఆదేశాలు పట్టించుకోని కార్పొరేట్ ఆస్పత్రులు
ఉస్మానియా యూనివర్సిటీ మాణికేశ్వర్నగర్ బస్తీకి చెందిన ఓ మహిళ (56) అనారోగ్యంతో బాధపడుతుండటంతో మూడు రోజుల క్రితం చికిత్స కోసం బంధువులు సికింద్రాబాద్లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. వెంటిలేటర్పై చికిత్సకు రోజుకు రూ.లక్ష ఖర్చు అవుతుందని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఒకరోజు వెంటిలేటర్ చికిత్సకు రూ.9500 నిర్ణయించింది కదా! అని ఆమె బంధువులు ఆస్పత్రి వైద్యులను నిలదీయగా.. ప్రభుత్వ నిర్ణయంతో మాకు సంబంధం లేదు. ఆ ధరలు మాకు గిట్టుబాటు కావు. బిల్లు చెల్లించే స్తోమత ఉంటే.. ఉండండి.. లేదంటే పేషెంట్ను తీసుకెళ్లండి’ అని ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు రోగి బంధువులు. ఒక్క సికింద్రాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రి మాత్రమే కాదు.. కరోనా చికిత్సలకు ఐసీఎంఆర్ నుంచి అనుమతి పొందిన నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులన్నీ ఇలాగే వ్యవహరిస్తున్నాయి. సామాజిక బాధ్యతను విస్మరించడమే కాదు.. ఏకంగా ప్రభుత్వ ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఆ ధరలు తమకు గిట్టుబాటు కావని.. ఆ ధరలకు తాము చికిత్సలు చేయలేమని.. తమ ఆస్పత్రిలో తాము నిర్ణయించిందే ధర అని తెగేసి చెబుతున్నాయి.
‘కరోనా వైరస్ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు రోగులను నిలువుదోపిడీ చేసే ప్రమాదం లేకపోలేదని భావించిన ప్రభుత్వం.. చికిత్సలకు ధరలను నిర్ణయించింది. ఆ మేరకు జీఓను కూడా జారీ చేసింది. కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ప్క్రెవేటు ఆస్పత్రుల్లో రూ.2500 నిర్ణయించింది. ఇంటి నుంచి నమూనాలు సేకరిస్తే అందుకు రూ.2800 చార్జీ నిర్ణయించింది. ఈ ధరలు గిట్టుబాటు కాకపోవడంతో నగరంలో ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా టెస్టులు చేయడం లేదు. ప్రస్తుతం 18 ల్యాబ్లు వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అనుమతి పొందాయి. వీటిలో సీసీఎంబీ, నిమ్స్, ఉస్మానియా, గాంధీ, ఫీవర్, ఐపీఎం, డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ కేంద్రాల్లో మాత్రమే టెస్టులు చేస్తున్నారు. మిగిలిన ప్రెమే ఆస్పత్రులు పరీక్షలు చేయడం లేదు. శాంపిల్స్ సేకరించి ఎప్పటిలాగే నిమ్స్కు పంపుతున్నాయి. ఇక కోవిడ్ చికిత్సలను కూడా నిరాకరిస్తున్నాయి. ఐసోలేషన్ చికిత్సలకు ప్రభుత్వం రోజుకు రూ.4000, ఐసీయూ చికిత్సలకు రోజుకు రూ.7500, వెంటిలేటర్ చికిత్సలకు రూ.9500 నిర్ణయించింది. పీపీఈ, ఇతర సర్జికల్ కిట్స్, సీటీ, ఎంఆర్ఐ లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రభుత్వం జీఓ కూడా జారీ చేసింది. నగరంలోని పలు కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఈ ఆదేశాలనే బేఖాతర్ చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు తమకు గిట్టు టు కావంటూ చికిత్సలకు నిరాకరిస్తుండటం వివాదాస్పదంగా మారుతోంది.
రూ.14 లక్షలు ఇవ్వాలంటున్నారు: రోగి కుమారుడు
మా అమ్మ (56) జ్వరంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం శనివారం సికింద్రాబాద్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశాను. శ్వాస సరిగా తీసుకోలేక పోతుండటంతో వెంటిలేటర్పైకి తరలించారు. ఇప్పటికే రూ.3 లక్షలు చెల్లించాను. కరోనా సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయింది. రోజుకు రూ.లక్ష చొప్పున ఖర్చు అవుతుందని, ఆ మేరకు 14 రోజులకు కలిపి రూ.14 లక్షలు చెల్లించేందుకు అంగీకరిస్తేనే చికిత్స చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంనిర్ణయించిన ధరలతో తమకు సంబంధం లేదన్నారు. మాది మధ్య తరగతి కుటుంబం. ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెస్తాం.? అని ఆ కుమారుడు వాపోయాడు.
ఏదీ ఏమైనా కేసీఆర్ ఈ విషయంలో తగిన చర్య తీసుకోకపోతే పేదల ప్రాణాలు కరోనా తీసుకెళ్లేలా కనిపిస్తోంది.






