India-Bangladesh: భారత్ అండ లేకుంటే స్వాతంత్రం వచ్చేదా..? విజయ్ దివస్ ను కించపరుస్తున్న బంగ్లాదేశ్ నేతలు..
ప్రస్తుతం మహ్మద్ యూనస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వం ఇండియా(India) వ్యతిరేకతే ఊపిరిగా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. పాకిస్తాన్, చైనా ఆజ్ఞలకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ ఏదోలా సాగిన ఇరుదేశాల సంబంధాలను కావాలనే బంగ్లా నాయకులు దెబ్బతీస్తున్నట్లు కనిపిస్తోంది.ఎందుకంటే.. విజయ్ దివస్ పై ప్రధాని మోడీ చేసిన పోస్టుపై బంగ్లా నేతలు అక్కసు వెలిబుచ్చారు. ఇండియా తమకు చేసిన సాయమేది లేదని.. ఇది కేవలం బంగ్లా విముక్తి పోరాటం(bangla liberation war) మాత్రమే అన్నారు.
విజయ దివస్ సందర్భంగా సాహస జవాన్లు, అమరవీరులను మోదీ స్మరించుకుంటూ సోషల్మీడియాలో పోస్ట్ పెట్టారు. ”ఈరోజు విజయ్ దివస్. 1971లో భారతదేశ చారిత్రక విజయానికి తమ ప్రాణాలు అర్పించిన అమరవీరులు, సాహస జవాన్లను సంస్మరించుకునే రోజు. వారి అంకితభావం, చెక్కుచెదరని పట్టుదల మనదేశానికి రక్షాకవచంగా, గర్వకారణంగా నిలుస్తోంది. వారి అసామాన్య సాహసం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. భవిష్యత్ తరాలకు వీరు స్ఫూర్తిదాయకం” అని మోదీ ప్రశంసించారు.
కాగా, భారత ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ ‘విజయ్ దివస్’ను 1971లో భారత్ సాధించిన చారిత్రక విజయంగా పేర్కొంటూ చేసిన పోస్ట్పై బంగ్లా నేతలు నిరసన వ్యక్తం చేశారు. ”బంగ్లేదేశ్ విజయం సాధించిన రోజు 1971 డిసెంబర్ 16. ఈ విజయానికి భారత్ చేయూత నిచ్చిందే కానీ అంతకు మించి ఏమీ లేదు” అని మహమ్మద్ యూనుస్ న్యాయ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్(asif nazrul) వ్యాఖ్యానించారు. వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం నేత హస్నత్ అబ్దుల్లా(hasnat abdullah) సైతం మోదీ సోషల్ మీడియా పోస్ట్పై నిరసన తెలిపారు. ”ఇది బంగ్లా విముక్తి పోరాటం. పాకిస్థాన్ నుంచి బంగ్లా స్వాతంత్రం కోసం జరిగిన పోరు. కానీ మోడీ మాత్రం ఇండియా చేసిన పోరాటం, విజయం తమదేనన్నట్టు చెబుతున్నారు. తద్వారా బంగ్లాదేశ్ ఉనికిని విస్మరిస్తున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు
తూర్పు పాకిస్తాన్ గా పిలుచుకునే బంగ్లాలో నరమేథం జరుగుతున్న వేళ .. నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ.. సైన్యాన్ని అక్కడకు పంపించింది.పాకిస్తాన్ మిలటరీని అక్కడ నుంచి పారద్రోలి.. బంగ్లాదేశ్ కు స్వాతంత్రం ప్రసాదించింది.అయితే ఇప్పుడా కృతజ్ఞత సైతం .. ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ సర్కార్ లో కనిపించడం లేదు. ఎక్కడ ఏ చిన్న సందు దొరికినా భారత్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.
పాకిస్థాన్ సైన్యం 1971 డిసెంబర్లో భారత బలగాల ముందు లొంగిపోయిన రోజును ‘విజయ్ దివస్’గా జరుపుకొంటాం. బంగ్లాదేశ్ మాత్రం మార్చి 26న ‘ఇండిపెండెన్స్ డే'( Independence day) జరుపుతుంది. భారత్ కీలక సాయంతో ‘లిబరేషన్ వార్’ ముగిసిన తొమ్మిది నెలల తర్వాత డిసెంబర్ 16న బంగ్లా రాజధానిగా ఢాకా ఏర్పడింది.
1971 డిసెంబర్ 16వ తేదీని పాకిస్థాన్పై సాధించిన విజయంగా ఏటా భారత్, బంగ్లాదేశ్ జరుపుకొంటాయి. రెండు దేశాల్లో జరిగే వేడుకలకు నాటి యుద్ధంలో పాల్గొన్న రిటైర్డ్ సైనికులు, సేవలందించిన అధికారులను ఇరుదేశాలు ఆహ్వానించుకుంటాయి. ఈ ఏడాది కూడా బంగ్లా విముక్తి పోరాటంలో పాల్గొన్న ఎనిమిది మంది భారత మిలటరీ వెటరన్లు ఢాకా వెళ్లగా, బంగ్లా ఆర్మీకి చెందిన ఎనిమిది మంది వార్ వెటరన్లు కోల్కతా వచ్చారు. బంగ్లాదేశ్లో ఇటీవల మైనారిటీ హిందువులపై వరుస దాడులు జరగడంతో భారత్-బంగ్లా మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి.






