Maoism: నక్సలిజం ఇక చరిత్రేనా? ముగింపు దశకు ఉద్యమం??

భారతదేశంలో దశాబ్దాలుగా అంతర్గత భద్రతకు పెను సవాలుగా ఉన్న మావోయిస్టు ఉద్యమం (Maoist) ఇప్పుడు పూర్తిగా ముగింపు దశకు చేరుకుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) మావోయిస్టులపై ఉక్కుపాదం మోపింది. ఓ వైపు అణచివేత.. మరోవైపునిరాశ, నిస్పృహకు లోనైన మావోయిస్టులు భారీగా లొంగిపోతున్నారు. దీంతో వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సల్ రహిత భారత్ను సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కనిపిస్తోంది.
మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా భద్రతా బలగాలు మావోయిస్టుల ప్రధాన స్థావరాలైన దండకారణ్యం, అబూజ్మడ్, కర్రెగుట్టల వంటి అటవీ ప్రాంతాల్లో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లు (FOB) ఏర్పాటు చేశాయి. అధునాతన నిఘా పరికరాలు, డ్రోన్లు, శాటిలైట్ ఇమేజింగ్లను ఉపయోగించి మావోయిస్టుల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వ్యూహాత్మక దాడులను తీవ్రతరం చేశాయి. ఈ ఆపరేషన్ వల్ల కొంతకాలంగా మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది. అనేక మంది ముఖ్య నాయకులు ఎన్కౌంటర్లలో మరణించడం, భారీ సంఖ్యలో కేడర్ లొంగిపోవడంతో ఉద్యమం తీవ్ర సంక్షోభంలో పడింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ఈ అణచివేత మరింత పదునుగా సాగుతోంది.
ప్రభుత్వ అష్టదిగ్బంధనం, భద్రతా బలగాల పటిష్టమైన చర్యల నేపథ్యంలో మావోయిస్టు అగ్రశ్రేణి నాయకులు సైతం లొంగుబాటు బాట పట్టడం ఉద్యమానికి అతిపెద్ద ఎదురుదెబ్బగా పరిణమించింది. మావోయిస్టు పొలిట్బ్యూరో సభ్యుడైన మల్లోజుల వేణుగోపాల రావు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో లొంగిపోవడం ఒక కీలక పరిణామం. కేంద్ర కమిటీ సభ్యుడు, ముఖ్య వ్యూహకర్త తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న/రూపేశ్ కూడా ఛత్తీస్ గఢ పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయనతో పాటు 130 మందికి పైగా మావోయిస్టులు భారీగా ఆయుధాలతో పోలీసులకు సరెండర్ అయ్యారు. ఇలాంటి కీలక నాయకులు, వ్యూహకర్తలు లొంగిపోవడం లేదా మరణించడం వల్ల మావోయిస్టు పార్టీలో నాయకత్వ శూన్యత ఏర్పడింది. వేలాది మంది కేడర్ జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపడం, 2025లో ఒక్క ఛత్తీస్గఢ్లోనే రికార్డు స్థాయిలో మావోయిస్టులు లొంగిపోవడం, ఉద్యమం అంతర్గత సంక్షోభాన్ని, దాని అంతిమ దశను సూచిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యాన్ని ప్రకటించింది. వరుస విజయాలు, భారీ లొంగుబాట్లు ఈ లక్ష్యానికి చేరువవుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు దేశంలోని 126 జిల్లాల్లో ప్రభావం చూపిన నక్సలిజం, ఇప్పుడు కేవలం 18 జిల్లాలకు పరిమితమైంది. హింసాత్మక సంఘటనలు కూడా గణనీయంగా తగ్గాయి.
అయితే, మావోయిస్టుల సమస్యకు శాంతి చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని, ‘ఆపరేషన్ కగార్’ పేరిట జరుగుతున్న సాయుధ దాడులు అమాయక ఆదివాసీలపై హింసను పెంచుతున్నాయని పౌర సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, హింసను పూర్తిగా నిలిపివేసి, శాశ్వత పరిష్కారం కోసం చర్చలకు రావాలనే వాదన కూడా తెరపైకి వస్తోంది.
మొత్తం మీద ప్రభుత్వ పటిష్ట చర్యలు, మావోయిస్టుల అంతర్గత బలహీనతలు కలసి ఉద్యమాన్ని పతనావస్థకు తీసుకువచ్చాయి. ఈ వేగంతో ముందుకు సాగితే, నక్సలిజం త్వరలోనే భారతదేశ చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.