Microsoft: మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్

భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) తాజాగా మైక్రోసాఫ్ట్ సలహాదారుగా నియమితులయ్యారు. మైక్రోసాఫ్ట్ (Microsoft) తో పాటు ఏఐ సంస్థ ఆంత్రొపిక్కు కూడా ఆయన సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఏఐ (AI) రంగంలో రెండు సంస్థలకు మార్గనిర్దేశనం చేసినందుకు గానూ పారితోషికం కూడా తీసుకోనున్నారు. బ్రిటన్ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత, టెక్ రంగంవైపు రిషి సునాక్ మళ్లడం ఇదే తొలిసారి. ఇక రిషి సునాక్ నియామకానికి బ్రిటన్ (Britain) కు చెందిన అడ్వైజరీ కమిటీ ఆన్ బిజినెస్ అపాయింట్మెంట్స్ (ఏసీఓబీఏ) అనుమతించింది. బ్రిటన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన 2023లో ఏఐ భద్రతకు సంబంధించి గ్లోబల్ సమావేశాన్ని నిర్వహించారు.
బ్రిటన్ ప్రధానిగా సేవలందించినందుకు రిషి సునాక్ విధులకు సంబంధించి ఏసీఓబీఏ పలు నిబంధనలు విధించింది. వీటి ప్రకారం, ఆయన మైక్రోసాఫ్ట్, ఆంత్రోపిక్ తరఫున బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలు, లాబీయింగ్ వంటివి చేయకూడదు. బ్రిటన్ ప్రధానిగా చేసిన సమయంలో తనకు తెలిసిన కీలక సమాచారాన్ని ప్రస్తుత విధుల్లో వినియోగించకూడదు. బ్రిటన్ ప్రభుత్వ పరిధిలోని మైక్రోసాఫ్ట్ లేదా ఆంత్రోపిక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. బ్రిటన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన వారు ప్రైవేటు రంగంలోకి ప్రవేశించినప్పుడు ఎలాంటి చిక్కులు రాకుండా ప్రభుత్వం ఈ నిబంధనలను రూపొందించింది.