Nethanyahu: పాలస్తీనాను ప్రత్యేకదేశంగా గుర్తిస్తామంటున్న యూరప్.. కుదరదంటున్న అమెరికా, ఇజ్రాయెల్

గాజాపై ఇజ్రాయెల్ (Israel) దాడులను ఆపాలని.. నిరవధికంగా కాల్పుల విరమణ ప్రకటించాలని యూరప్ (Europe) డిమాండ్ చేస్తోంది. అమెరికా అండగా ఉన్నప్పటికీ.. ఈ దాడుల దారుణాలను తాము చూడలేమంటోంది. అంతేకాదు…. కాల్పుల విరమణ,ద్విదేశ సిద్ధాంతానికి అంగీకరించకపోతే సెప్టెంబరులో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తేల్చి చెప్పారు. ఒక్క బ్రిటన్ మాత్రమే కాదు ఫ్రాన్స్ సహా పలు యూరప్ దేశాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ద్విదేశ సిద్ధాంతమే ఈసమస్యకు అసలు సిసలు ప్రత్యామ్నాయమంటోంది యూరోపియన్ యూనియన్.. దీన్నే అరబ్ దేశాలు సైతం వక్కాణిస్తున్నాయి. అలా అయితే అటు పాలస్తీనా.. ఇటు ఇజ్రాయెల్ ఎప్పటిలాగే తమ దేశాల్లో ప్రజల్ని పాలించుకుంటూ ప్రశాంత జీవనం సాగించవచ్చన్నది వాటి అభిమతం. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఉగ్రవాద దేశాలతో అలాంటి ఒప్పందాలకు వ్యతిరేకమంటోంది. అంతేకాదు.. యూరప్ దేశాల ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోంది.
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. హమాస్ ఉగ్ర కార్యకలాపాలకు కీర్ స్టార్మర్ పరోక్షంగా మద్దతిస్తున్నారని మండిపడ్డారు. తద్వారా హమాస్ బాధితులను శిక్షిస్తున్నట్లు అవుతోందని పేర్కొన్నారు. ‘‘మా సరిహద్దులోని ఈ ప్రాంతాన్ని దేశంగా గుర్తిస్తే.. అది భవిష్యత్తులో బ్రిటన్కూ ముప్పుగా మారుతుంది. ఈ గుర్తింపు విషయంలో బ్రిటన్ ఓ చారిత్రక, నైతిక బాధ్యతను కలిగి ఉంది’’ అని అన్నారు. ఉగ్రవాదుల పట్ల బుజ్జగింపు చర్యలనేవి పనిచేయవని పేర్కొన్నారు.
పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలనే బ్రిటన్, ఫ్రాన్స్ తదితర యూరప్ దేశాల ప్రణాళికలను బందీల కుటుంబాలు తప్పుపట్టాయి. ఇటువంటి చర్యలు ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తాయని విమర్శించాయి. ఇది శాంతిస్థాపనకు దోహదపడదని, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అవుతుందని పేర్కొన్నాయి.