న్యూయార్క్ లో టిటిఎ నిధుల సేకరణ విజయవంతం… 4.5లక్షల డాలర్ల విరాళం ఇచ్చిన దాతలు
తెలంగాణ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) ఆధ్వర్యంలో న్యూయార్క్లో నిర్వహించిన మెగా కన్వెన్షన్ నిధుల సేకరణ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ఛార్లెట్ లో నిర్వహించనున్న టిటిఎ మహాసభలను పురస్కరించుకుని టిటిఎ నాయకులు వివిధ నగరాల్లో నిధుల సేకరణతోపాటు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా న్యూయార్క్ లో నిర్వహించిన నిధుల సేకరణ, ప్రచార కార్యక్రమానికి కమ్యూనిటీ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులో ఎక్కువమంది తెలుగువారు పాల్గొని తమవంతుగా మహాసభల విజయవంతానికి సహకరిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మహాసభల కోసం విరాళాలను ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 450,000 డాలర్లు (సుమారు 4.5 లక్షల డాలర్లు) సేకరించినట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ఈ సందర్భంగా టిటిఎ వ్యవస్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డికి టిటిఎ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన స్వయంగా ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా, దాతలను ఉత్తేజపరుస్తూ నిధుల సేకరణలో కీలక పాత్ర పోషించారని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా విచ్చేసిన అడ్వైజరీ చైర్ విజయ్ పాల్ రెడ్డి, కో-చైర్ మోహన్ రెడ్డి పాటలోళ్ళ, ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మలిపెద్ది, మరియు కన్వీనర్ ప్రవీణ్ చింత తదితరులు టిటిఎ మహాసభల గురించి వివరించి అందరూ పాల్గొనాల్సిందిగా కోరారు.
ఈ నిధుల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన న్యూయార్క్ టీమ్ ను నాయకులు అభినందించారు. సహోదర్ రెడ్డి పెద్దిరెడ్డి, ఉషారెడ్డి మన్నెం, రంజిత్ క్యాతం, శ్రీనివాస్ గూడూరు, జయప్రకాశ్ ఇంజపురి తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు.
ఇవి కూడా చదవండి
