28న తెలంగాణలో 29న ఏపీలో ఉగాది
తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. తెలంగాణలో ఉగాది పండుగకు ఈ నెల 28న సెలవు దినాన్ని ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్లో 29న ప్రభుత్వం సెలవును ఇచ్చింది. ఈ వైఖరి తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర అయోమయంలోకి నెట్టివేసిందని సిద్ధాంతులు చెబుతున్నారు. పంచాంగ కర్తల గణనాల్లో తేడాల కారణంగానే ఈ సమస్య ఏర్పడిందని అంటున్నారు. మార్కెట్లో నాలుగు రకాల పంచాంగాలు ఉండటం, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తాము నమ్మిన పురోహితుల మాటలను వినడంతోనే ఈ సమస్య ఏర్పడిందని అందరూ అభిప్రాయపడతున్నారు. అయితే ఈనెల 28 ఉదయం 8 గంటల తరువాత నుంచి హేవిలంబి నామ సంత్సరం చైత్ర శుద్ధ పాడ్యమీ ప్రవేశిస్తుండగా, ఆ మరుసటి రోజు 29న సూర్యోదయం కాకుండానే విదియ వస్తుంది. రెండు సూర్యోదయాలూ లేకుండా తిథులు వచ్చినప్పుడు తొలి రోజు మాత్రమే పండగ చేసుకోవాలని అత్యధికులు సూచిస్తున్నారు. ఈ ప్రకారం 28న పండుగ జరుపుకోవాలని పిలుపునిస్తుండగా, టీటీడీ క్యాలెండర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 29న సెలవును ప్రకటించనుంది. దీంతో ఉగాది తేదీపై సస్పెన్స్ మరింత పెరుగగా, పాడ్యమి తిథి లేని సమయంలో పంచాంగ శ్రవణం కూడదని, కనీసం ఉగాది పచ్చడి తినే వేళకు కూడా పాడ్యమి ఉండని రోజున ఉగాది జరుపుకోవాలని పలువురు ప్రశ్నిస్తున్నారు.






