Harish Rao: బీఆర్ఎస్ పై బురదజల్లేందుకే శాసనసభ సమావేశాలు : హరీశ్ రావు
రెండేళ్లలో అన్ని వ్యవస్థలనూ భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం, రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ వ్యవస్థను సైతం తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) ఆరోపించారు. బీఆర్ఎస్ఎల్పీలో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలను విస్మరించి, కేవలం బీఆర్ఎస్ (BRS) పై బురదజల్లేందుకే శాసనసభ సమావేశాలు నిర్వహించడం దుర్మార్గమన్నారు. సభను హుందాగా నడుపుదామంటూ గొప్పలు చెప్పే కాంగ్రెస్ (Congress) నేతలకు అసలు హుందాతనమే లేదని అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) తన ప్రసంగాల్లో చిల్లర, చిచోరా భాష ఉపయోగించి సభా గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి ఒక్కరికే మాట్లాడే అవకాశమిచ్చి ప్రధాన ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కచ్చితంగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని, సభను 15 రోజులపాటు నడపాలని కోరారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా, ఇప్పటి వరకు కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీ హౌస్ కమిటీలు వేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఏటా సగటున 32 రోజులు అసెంబ్లీ నడిపితే, కాంగ్రెస్ రెండేళ్లలో 40రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించిందని చెప్పారు. ఈసారి కనీసం 15రోజులైనా సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.






