Nara Lokesh: మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన విజయవంతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్టాన్రిక్స్ శాఖల మంత్రి లోకేశ్ (Nara Lokesh) ఆస్ట్రేలియా పర్యటన విజయవంతమైంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూల వాతావరణం.. సీఎం చంద్రబాబు పాలనానుభవంతో గత 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం.. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ను తీసుకురావడానికి తాను పడిన కష్టాన్ని పారిశ్రామికవేత్తలకు ఆయన వివరించారు. పెట్టుబడుల కోసం అక్కడ ఒప్పందాలకు తొందరపడకుండా వారందరినీ వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖ భాగస్వామ్య సదస్సుకు రప్పించడానికే ఆయన ప్రాధాన్యమిచ్చారు. వారి పెట్టుబడులకు పూర్తి భరోసా ఇచ్చారు. ఒకసారి ఏపీ ప్రభుత్వంతో చేతులు కలిపాక వారి ప్రాజెక్టుల బాధ్యత మొత్తం తమదేనని హామీ ఇచ్చారు. గడువు కంటే ముందే అనుమతులు వచ్చేలా చేస్తామని.. ఉత్పత్తి మొదలయ్యేదాకా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
చంద్రబాబు పాలనానుభవం.. పాలనాదక్షతలను లోకేష్ తన పర్యటనలో బాగా మార్కెటింగ్ చేశారు. తన ఆస్ట్రేలియా పర్యటన కొత్త భాగస్వామ్యాలపై నమ్మకం కలిగించిందని మంత్రి లోకేశ్ చెప్పారు. పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన ఆయన తన పర్యటన వివరాలను పంచుకుంటూ ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. వారం రోజులపాటు ఆస్ట్రేలియాలోని నాలుగు ప్రధాన నగరాల్లో పర్యటించాను. పారిశ్రామికవేత్తలతో భేటీలు ఆశాజనకంగా జరిగాయని చెప్పారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్లను పరిశీలించాను. క్రీడలను శక్తిమంతమైన రంగంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో అవకాశాలు చాలా ఉన్నాయని గుర్తించాను. భారత దేశం 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థవైపు దూసుకుపోతున్న ఈ సమయంలో పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ శక్తి బలోపేతం వంటి వాటిపై ఆలోచనలు పంచుకున్నాం’ అని వివరించారు.
తన పర్యటన ఫలాలు విశాఖ పారిశ్రామిక సదస్సులో ప్రతిబింబిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే ఎపికి వచ్చిన పెట్టుబడుల వివరాలను కూడా ఆయన తన చర్చల్లో ప్రస్తావించి వారిని కూడా పెట్టుబడులు పెట్టేలా ఒప్పించారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ రూ.87 కోట్లతో దేశంలోనే అదిపెద్ద స్టీల్ ప్లాంట్ను స్థాపించనుండడం.. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలను పెద్దఎత్తున ప్రారంభించేందుకు సిద్ధమవుతుండడాన్ని ఆయన తన చర్చల్లో ప్రధానంగా ప్రస్తావించారు. ప్రాంతాల వారీగా, క్లస్టర్ల వారీగా పరిశ్రమల స్థాపనపై రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను ఆయా సంస్థల దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలో గత పాలకుల విధ్వంసక చర్యలపై పెట్టుబడిదారుల్లో నెలకొన్న భయాలను తొలగించడంపైనా లోకేశ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. 2014-19 నడుమ, 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నెలకొన్న పారిశ్రామిక సానుకూల వాతావరణాన్ని వివరించారు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ వెన్నుదన్నుగా నిలవడాన్ని సోదాహరణంగా వివరించడంలో లోకేశ్ సఫలమయ్యారు. ఆస్ట్రేలియాలోని ప్రముఖ యూనివర్సిటీల వీసీలు, ప్రొఫెసర్లతో చర్చలు జరిపారు. విద్యతోపాటు క్రీడల రంగంలోనూ సహకారం అర్థించారు. రాష్ట్రంలో క్రికెట్ అకాడమీలు, ఉమ్మడి శిక్షణ శిబిరాలు, ఫ్రెండ్లీ మ్యాచ్ల నిర్వహణపై దృష్టి సారించాలని కోరినట్లు మంత్రి లోకేష్ తెలిపారు.






