India: 2060 నాటికి అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా భారత్..!
భారత దేశం (India) జనాబాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 140కోట్లకు పైగా జనాభాతో దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. దేశంలో ముస్లిం జనాభా సైతం అంతే స్థాయిలో పెరుగుతోంది. 2060 నాటికి దేశంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుందని.. ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన అధ్యయం వెల్లడించింది.
ముస్లిం జనాభా పెరుగుదలకు కారణాలు అనేకం ఉండొచ్చు. ఈ పెరుగుదల మాత్రం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన మొదటి దేశంగా ఇండోనేషియా ఉంది. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంగా భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. 2015 గణాంకాల ప్రకారం ఇండోనేషియాలో 87.1 శాతం ముస్లింలు ఉండగా, భారతదేశంలో 14.9 శాతం ఉన్నారు. అయితే, 2060 నాటికి భారతదేశంలో ముస్లింల సంఖ్య పెరిగి మొదటి స్థానానికి చేరుకుంటుందని, పాకిస్థాన్ రెండవ స్థానంలో ఉంటుందని ప్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం ముస్లిం జనాభాలో 11.1 శాతం భారతదేశంలో ఉన్నారు. ఇండోనేషియాలో 12.6 శాతం, పాకిస్థాన్లో 10.5 శాతం ఉన్నారు.
దేశంలో కొన్ని ప్రాంతాల్లో ముస్లిం జనాభా పెరుగుదలకు చొరబాట్లే ప్రధాన కారణమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. చొరబాట్లను కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని ఆరోపించారు. “చొరబాటు అనేది కేవలం రాజకీయ అంశం కాదు. ఇది దేశ భద్రతకు, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా పరిణమించిన ఒక జాతీయ సమస్య. 2011 జనాభా లెక్కల ప్రకారం, అస్సాంలో ముస్లిం జనాభా పదేళ్లలో 29.6 శాతం మేర వృద్ధి చెందింది. చొరబాటు లేకుండా ఈ స్థాయిలో వృద్ధి జరగడం అసాధ్యం. అలాగే పశ్చిమ బెంగాల్లోని అనేక జిల్లాల్లో ముస్లిం జనాభా వృద్ధి రేటు 40 శాతం వరకు ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో అయితే అది 70 శాతం వరకు చేరుకుంది. గతంలో చొరబాట్లు జరిగాయనేదానికి ఇది అసలైన నిదర్శనం.” అని ఆందోళనకర అంశాన్ని అమిత్ షా పంచుకున్నారు. ఈ అంశంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.






