ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం.. పెద్ద ఎత్తున హాజరైన ఇండియా కూటమి నేతలు

ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధ్యక్షుడు హేమంత్ సోరెన్.. ఝార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 81 సీట్లలో జేఎంఎం కూటమి ఏకంగా 56 సీట్లు గెలుచుకుంది. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం 34 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. ఈ నేపథ్యంలోనే హేమంత్ సోరెన్.. ఝార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని మొరహాబాద్ మైదానంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇండియా బ్లాక్ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. ఈ ఏడాది ప్రారంభంలో భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. సీఎం పదవికి రాజీనామా చేసిన ఆయన ఐదు నెలలపాటు జైలు జీవితం గడిపిన తర్వాత విడుదలయ్యారు.