Washington: చైనాపై ట్రంప్ టారిఫ్ వార్.. 104 శాతానికి చేరిన సుంకాలు..

అమెరికా (USA), చైనా (China)ల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు. తన హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో తాజాగా చైనాపై భారీ స్థాయిలో మరోసారి సుంకాలు విధించారు. దీంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104 శాతానికి చేరాయి. ఇవి ఇవాళ్టి నుంచి అమలులోకి వచ్చాయని వైట్ హౌస్ స్పష్టం చేసింది.
ఇటీవల చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో.. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకం విధించాలని చైనా నిర్ణయించింది. దీంతో భగ్గుమన్న ట్రంప్.. ఏప్రిల్ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. లేకుంటే అదనంగా మరో 50 శాతం ప్రతీకార సుంకం విధిస్తానన్నారు. ఇచ్చిన గడువులోగా చైనా స్పందించకపోవడంతో తాను చెప్పినట్లుగానే చేశారు. అదనంగా మరో 50 శాతం సుంకాలు పెంచుతున్నట్లు అమెరికా తాజాగా ప్రకటించింది.
పలు దేశాలు తమ వస్తువులపై అధిక సుంకాలు విధిస్తూ తమ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్నాయని ట్రంప్ … ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు. అన్ని దేశాలు తమ వస్తువులపై సుంకాలు తగ్గించాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు కూడా. ఇటీవల అన్నిదేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకాలు విధిస్తూ వచ్చింది. ఇటీవల పెంచిన సుంకాలతో కలిసి చైనా(china)పై మొత్తం సుంకాలు 54 శాతానికి చేరుకున్నాయి. తాజాగా మరో 50 శాతం పన్నులు పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో చైనాపై మొత్తం సుంకాలు 104 శాతానికి చేరుకున్నాయి.