RBI: బంగారమే ఆర్థికబలం.. విదేశీ ఖజానాల్లో దాచిన పసిడి వెనక్కు తెస్తున్న ఇండియా..!
ప్రపంచవ్యాప్తంగా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఓ వైపు ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కంటిన్యూగా సాగుతోంది. ఎవరెన్ని చెప్పినా పుతిన్ తన పంతం వదులుకోవడం లేదు. ఇక మరోవైపు ఇజ్రాయెల్ గాజా వార్ ఆగినట్లే ఆగి ముందుకు సాగుతోంది. ఇక ఇటీవలే పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో భారత్ ముందస్తు చూపుతో వ్యవహరిస్తోంది. విదేశీ ఖజానాల్లో దాచిన పసిడిని నెమ్మదిగా వెనక్కు తీసుకొస్తోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇతర దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షల నుంచి తమ ఆస్తులను కాపాడుకునేందుకే ఆర్బీఐ (RBI) ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.
అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే ఆర్బీఐ సుమారు 64 టన్నుల బంగారాన్ని భారత్కు తరలించింది. సెప్టెంబర్ చివరి నాటికి భారత్ వద్ద మొత్తం 880.8 టన్నుల బంగారం నిల్వలు ఉండగా, అందులో 575.8 టన్నులు ఇప్పుడు దేశీయ ఖజానాల్లోనే భద్రంగా ఉన్నాయి. మిగిలిన 290.3 టన్నుల పసిడిని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) వద్ద ఉంచారు. మరో 14 టన్నులు గోల్డ్ డిపాజిట్ స్కీమ్లలో ఉన్నాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత జీ7 దేశాలు ఆయా దేశాల విదేశీ మారక నిల్వలను స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత 2023 మార్చి నుంచి ఆర్బీఐ విదేశాల నుంచి ఏకంగా 274 టన్నుల బంగారాన్ని స్వదేశానికి తీసుకొచ్చింది. విదేశాల్లోని ఆస్తుల భద్రతపై ఆందోళనల కారణంగానే ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు బంగారం ధరలు దాదాపు 52 శాతం పెరిగాయి. అక్టోబర్ 20న ఔన్సుకు 4,381.21 డాలర్ల ఆల్టైమ్ గరిష్ఠాన్ని తాకింది. ప్రపంచవ్యాప్త అనిశ్చితి, వడ్డీ రేట్ల కోతపై అంచనాలు, ఆర్బీఐ వంటి కేంద్ర బ్యాంకులు కొనుగోళ్లు కొనసాగించడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.







