చిన్న పట్టణాల్లో పెరిగిన డిమాండ్

దేశంలో కరోనా కారణంగా ఇబ్బందుల్లో పడిన హౌసింగ్ రంగం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ప్రజలు కూడా ఇప్పుడు ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్లకు డిమాండ్ పెరిగింది. కరోనా తర్వాత భారీ సంఖ్యలో చిన్న పట్టణాలకు తిరిగి వలసపోవడమే దీనికి కారణమని హౌసింగ్ డాట్ కామ్ నివేదిక తెలియజేసింది. ఏడాది క్రితంతో పోలిస్తే ఇళ్ల కొనుగోలు, అద్దె ఇళ్లకు డిమాండ్ మూడు రెట్లు పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. ‘‘హౌసింగ్ డాట్కామ్ ప్లాట్ఫామ్పై గడిచిన కొన్ని నెలల కాలంలో నివాసిత గృహాలకు ఆసక్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అమృత్సర్, చండీగఢ్, నాగ్పూర్, విజయవాడ, కోయంబత్తూర్ తదితర పట్టణాల విషయంలో ఈ పరిస్థితి కనిపించింది’’ అంటూ ఎలారా టెక్నాలజీస్ సీఈవో ధృవ్ అగర్వాల్ తెలిపారు.
ఉపాధి రంగంలో వచ్చిన మార్పుల వల్ల ఎక్కువ మంది తిరిగి సొంత పట్టణాలు, చిన్న పట్టణాలకు వలసబాట ప్టడంతో చిన్న పట్టణాల్లో ఇళ్ల కొనుగోలుకు, అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడమే కాకుండా, ఈ కామర్స్ సంస్థల వృద్ధికి కూడా తోడ్పడినట్టు తెలిపింది.
పెద్ద పట్టణాల్లో పడిపోయిన అమ్మకాలు
దేశంలో కరోనావచ్చిన తరువాత ఇళ్ళ అమ్మకాలు బాగా పడిపోయాయి. దేశంలోని ఏడు ప్రథమ శ్రేణి పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు గణనీయంగా తగ్గినట్లు ఓ నివేదిక తెలుపుతోంది. జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో 29,520 యూనిట్లు అమ్ముడుపోయాయని, క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన అమ్మకాలు 55,080 యూనిట్లతో పోలిస్తే 46 శాతం తగ్గినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్), కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణేలో కరోనా కారణంగా డిమాండ్ పెద్దగా లేనట్లు పేర్కొంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ కాలంలో ఇళ్ల అమ్మకాలు 57% క్షీణించి 87,460 యూనిట్లు (ఒక యూనిట్:ఒక ఇల్లు/ఫ్లాట్)గా ఉన్నాయి. కానీ, 2019 ఇదే కాలంలో 2,02,200 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 12,730 యూనిట్లకు పడిపోగా, తర్వాతి త్రైమాసికం జూలై-సెప్టెంబర్లో విక్రయాలు రెట్టింపునకు చేరినట్టు అన్రాక్ చైర్మన్ అనుజ్పురి తెలిపారు.