CHINA: వరుసగా నాలుగో ఏడాది తగ్గిన జనాభా…తల పట్టుకున్న చైనా ..?
ప్రపంచంలో అగ్రదేశంగా మారాలని తపిస్తున్న చైనాకు.. జనాభా సంక్షోభం పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్ని చర్యలు చేపడుతున్నా.. జనాభా పెరగడం లేదు కదా.. తగ్గుతూ వస్తోంది. వరుసగా నాలుగో ఏడాది జననాల విషయంలో తగ్గుదల నమోదైంది. దీంతో జనాభాను పెంచడం ఎలా అన్న విషయమై.. తలబద్దలు కొట్టుకుంటోంది కమ్యూనిస్టు చైనా. ముఖ్యంగా ప్రభుత్వం ఎన్ని ఆఫర్లు ప్రకటిస్తున్నా యువత మాత్రం.. పెళ్లి జంజాటం, పిల్లల పెంపకం లాంటి కఠిన టాస్క్లు వద్దంటోంది.
చైనా (China)లో వరుసగా నాలుగో ఏడాదీ జనాభా తగ్గుదల నమోదైంది. 2025 ఏడాది చివరికి చైనాలో 140.4 కోట్ల జనాభా ఉంది. 2024తో పోలిస్తే 30 లక్షల జనాభా తగ్గింది. ఈ గణాంకాలను చైనా ప్రభుత్వం విడుదల చేసింది. 2025 ఏడాది జననాల సంఖ్య కేవలం 79.2 లక్షలుగా నమోదు కాగా, ఇది 2024 జనాభా సంఖ్యతో పోలిస్తే 17% తక్కువ. ఇది ప్రతికూల అంశమని అక్కడి ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతోందన్నారు.
చైనాలో ప్రజల జీవన వ్యయాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా పిల్లల పెంపకం వ్యవహారం చాలా ఖరీదుగా మారింది. పిల్లలకు 18 ఏళ్ల వరకు చదువుకు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి సరాసరి 76 వేల డాలర్లు ఖర్చు అవుతున్నట్లు అంచనా. దీంతో చాలామంది యువత పెళ్లి చేసుకునేందుకు వెనకాడుతుండగా, పెళ్లయిన వారు పిల్లల్ని కనేందుకు ఆలోచిస్తున్నారు. యువతలో ఈ వైఖరి మార్చేందుకు చైనా ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కండోమ్స్ సహా గర్భనిరోధక సాధనాలు, పలు వస్తువులపై 13 శాతం పన్ను విధిస్తూ విలువ ఆధారిత పన్ను చట్టాన్ని ఇప్పటికే సవరించింది. పిల్లల సంరక్షణ సేవలు (నర్సరీ నుంచి కిండర్గార్డెన్ వరకు), వృద్ధుల సంరక్షణ, వికలాంగుల సేవలు, వివాహ సంబంధిత సేవలపై పన్ను మినహాయింపును జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఇన్ని చేస్తున్నా అవేవీ ఫలితమివ్వడం లేదు.






