Qatar: గాజాలో శాంతి కుసుమాలు విరబూసేనా..? తుదిదశకు శాంతి చర్చలు ..!
రావణకాష్టంలా రగులుతున్న గాజా(Gaza) లో శాంతిస్థాపన దిశగా అడుగులు పడుతున్నాయి. లక్షలాదిమంది మృతికు కారణమైన ఈ యుద్ధాన్ని నిలిపివేసేలా ఇజ్రాయెల్, హమాస్ పై తెస్తున్న ఒత్తిడి ఫలిస్తోంది. గాజాలో శాంతి స్థాపన కోసం ఇజ్రాయెల్- హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం (Gaza Ceasefire) చర్చలు కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు సంబంధించిన ప్రతిపాదనకు హమాస్ (Hamas) అంగీకరించినట్లు చర్చల్లో పాల్గొన్న అధికారులు వెల్లడించారు. ఒప్పందానికి అత్యంత చేరువలో ఉన్నట్లు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతర్(Qatar) సైతం తెలిపింది. చర్చల్లో పురోగతి ఉందని, సంబంధిత అంశాలు ఖరారు దశలో ఉన్నట్లు ఇజ్రాయెల్ (Israel) పేర్కొంది. తుది ఆమోదం కోసం సంబంధిత ప్రణాళికను ఇజ్రాయెల్ క్యాబినెట్కు సమర్పించాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు.
ప్రస్తుత చర్చలు సానుకూలంగా, సత్ఫలితాల దిశగా సాగుతున్నట్లు ఖతర్ విదేశాంగశాఖ ప్రతినిధి మజీద్ అల్-అన్సారీ వెల్లడించారు. ఒప్పందానికి అత్యంత చేరువైనట్లు తెలిపారు. చర్చలు తుదిదశకు చేరుకున్నట్లు హమాస్ సైతం ఓ ప్రకటనలో వెల్లడించింది. తన పదవీ కాలం పూర్తయ్యేలోగా గాజా యుద్ధానికి తెరదించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్(Biden) భావిస్తున్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్య అధ్యక్షుడిగా తాను అధికార బాధ్యతలు చేపట్టేలోగా బందీలను విడుదల చేయాలని డొనాల్డ్ ట్రంప్(Trump) కూడా హమాస్కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్పై మెరుపుదాడులకు పాల్పడిన హమాస్ ఉగ్రవాదులు.. దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. అదే ఏడాది నవంబరులో తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో దాదాపు సగం మందిని విడిచిపెట్టారు. ఇంకా దాదాపు 100 మంది బందీలు హమాస్ చెరలో ఉన్నట్లు సమాచారం. అయితే, వారిలో మూడోవంతు మంది మృతి చెందినట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ క్రమంలోనే యుద్ధానికి తెరదించేలా ఇరుపక్షాల నడుమ శాంతి ఒప్పందాన్ని కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతర్లు ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. చర్చల పరిస్థితుల్లో ప్రస్తుతం ఆకస్మిక మార్పు వచ్చిందని.. స్పష్టమైన ఒప్పంద ప్రతిపాదన ఒకటి తెరపైకి వచ్చిందని అధికారులు తెలిపారు.






