ASBL NSL Infratech

శెభాష్‌ తానా...

శెభాష్‌ తానా...

సంప్రదింపులు... ఏకగ్రీవాలతో కొత్త కార్యవర్గం ఏర్పాటు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ఏం జరిగినా అది ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కువమంది సభ్యులు ఉన్న సంస్ధగా తానాకు పేరు ఉంది. దానికితోడు కోట్లాదిరూపాయలతో తానా చేసే సేవా కార్యక్రమాలు ప్రపంచంలోనే ఏ సంస్థ చేయలేదు. అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కమ్యూనిటీకి ఎల్లప్పుడూ నిరంతరం సేవ చేసే సంస్థగా పేరు పొందిన తానాలో ఎన్నికల సమయం వచ్చేటప్పటికీ వివాదాలు చుట్టుముడుతుంటాయి. ఎన్నికల ముందు కలిసిమెలిసి తిరిగిన వారు కూడా ఎన్నికల సమయంలో వర్గాలుగా విడిపోయి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుంటారు. దానికితోడు గెలుపుకోసం ఎంతో డబ్బును, సమయాన్ని వెచ్చిస్తుంటారు. అలాంటి తానాలో ఎప్పుడూ జరగని విధంగా ఎన్నికలు లేకుండా 2023-25 ఎగ్జిక్యూటివ్‌ కమిటీని, ఇతర కమిటీ సభ్యులను ఎన్నుకోవడం ఇప్పుడు హాట్‌ టాఫిక్‌ అయింది.

ఇటీవలనే ఫిలడెల్పియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో తానా 23వ మహాసభలు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇదే మహాసభల్లో చివరిరోజున తానా నూతన కార్యవర్గం ఎలా ఉంటుంది, ఎన్నికలు జరుగుతాయా లేక ఏమి చేస్తారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి, చర్చలు జరిగాయి. ఎందుకంటే సరైన సమయంలో తానా కార్యవర్గం ఎన్నికలు జరగకపోవటమే ఇందుకు కారణం. ఈ సంవత్సరం జరగాల్సిన ఎన్నికల విషయంలో ఇరు వర్గాలు మేరీల్యాండ్‌ కోర్ట్‌ని ఆశ్రయించటం, ఇంజంక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకోవటం, ఎన్నికలు జరగక పోవటం తానా సభ్యులతోపాటు అందరికీ తెలిసిన విషయం. ఇంకా చెప్పాలంటే ఎన్నికలు జరగకపోతే.. కొత్త కార్యవర్గం తయారుకాకపొతే జరిగే పరిణామాలు (రాజ్యాంగ సంక్షోభం) గురించి  సీనియర్‌ లేదా సీరియస్‌ తానా సభ్యుల్లో ఆందోళన కూడా నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో తానా బోర్డ్‌ మీటింగ్‌ను ఏర్పాటు చేసుకుని తానా పెద్దలు ఈ వివాదాన్ని సున్నితంగా పరిష్కరించి కొత్త కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపికయ్యేలా చూసుకున్నారు. దీంతో తానాకు గత కొద్దీ నెలలుగా పట్టిన గ్రహాణం బోర్డు మీటింగ్‌లో తీసుకొన్న తీర్మానాలతో పూర్తిగా పోయింది. 

30-40 రోజులుగా ఏం జరిగింది?

తానా ఎన్నికల విషయంలో కొత్త గా చేరిన సభ్యులకు వోటు హక్కు ఇచ్చే విషయంలో ఇరు వర్గాలు కోర్టుకి వెళ్ళటం వలన ఎన్నికల నిర్వహణ ఆగిపోయింది. తానా రాజ్యాంగం ప్రకారం అప్పటికే 2 సంవత్సరాల క్రితం ఎన్నికైన ఎక్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, 2- 3 నెలల క్రితం ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో, తానా మహాసభల చివరి రోజున బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం కార్యవర్గ ఎన్నికలు జరగ లేదు. ప్రస్తుత కార్యవర్గం (అంజయ్య చౌదరి టీమ్‌) కాల పరిమితి పెంచాలంటే బోర్డ్‌ లో 2/3 మెజారిటీతో ఆమోదం పొందాలి కనుక ఆ పని చెయ్యలేకపోయింది. మరి ఎలా? దీనినే రాజ్యాంగ సంక్షోభం అంటారు.

అప్పుడు తానా పెద్దలు జయరామ్‌ కోమటి, నాదెండ్ల గంగాధర్‌, జంపాల చౌదరి ఇరు వర్గాల మధ్య సంధి సమావేశాలు నిర్వహించటం మొదలు పెట్టారు. తానాలో భీష్ముడి లాంటి డా.బండ్ల హనుమయ్య ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా ఉండటం వలన కూడా రాజీ ప్రయత్నాలు సెమి ఫార్మల్‌గా జరగటం మొదలు అయ్యాయి. ఎన్నికలు జరిపి ప్రజాస్వామ్య బద్దంగా నాయకులు రావటం మంచి విషయమే.. హర్షణీయం. గౌరవనీయం కూడా..  అయితే తానా లాంటి నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌కి ఇలాంటి విపత్కరపరిస్థితి నుంచి బయట పడాలంటే... ఎన్నికలు లేకుండా ఇరు వర్గాలు రాజి పడి ముందుకు వెళ్ళాలని చెప్పారు. 

ఎన్నికల్లో నిలబడిన నరేన్‌ కొడాలి వర్గం, నిరంజన్‌ శృంగవరపు వర్గం కూడా అందుకు సమ్మతించి రాజి చర్చలకు ముందుకు వచ్చాయి. జయ్‌ తాళ్లూరి, సతీష్‌ వేమన లాంటి సీనియర్లు కూడా ఇలా వెళ్ళటమే పరిష్కారం అని ఇరు వైపులా సూచించారు. రాజి మార్గం అంటే ఇరు వైపులా కొందరు పోటీదారులు తప్పుకోవాలి. అలాగే ఆ పేర్లు ఇరు వర్గాలు ఒప్పుకోవాలి. ఇది ఒక రోజులో, ఒక మీటింగ్‌ లో తేలే విషయం కూడా కాదు. ఆ విధంగా అనేక ఫార్మల్‌ టెలి కాన్ఫరెన్స్‌ లు, ఇన్ఫార్మల్‌ ఫోన్‌ డిస్కషన్స్‌ లతో, మెల్ల మెల్లగా ఇరు వర్గాలకు ఆమోద యోగ్యమైన సభ్యుల సెలక్షన్‌ (ఎలక్షన్‌కి బదులుగా) జరుగుతూ వచ్చింది.

10 జులై 2023న ఏం జరిగింది? 

ఇరు వర్గాలు మాట్లాడుకొని ఆమోద యోగ్యమైన సభ్యులతో ఒక కార్యవర్గం ఏర్పడటం ఒక ఎత్తు అయితే... ఆ కార్యవర్గం ఎన్నిక అయినట్టు ప్రకటించాలి అంటే తానా బోర్డు ఆమోదించాలి.  బోర్డు సమావేశం తానా సభల ముందు జరిగితే సభల నిర్వహణకి ఏమన్నా ఇబ్బంది రావచ్చు అని ఆ సమావేశాన్ని ఈరోజు (10 జులై 2023) న హోటల్‌ మారియట్‌ లో జరిపారు. కొత్త కార్యవర్గాన్ని బోర్డులో ప్రవేశ పెట్టి 2/3 మెజారిటీ తో పాస్‌ అయ్యేలా చూసుకొన్నారు. ఆ విధంగా వచ్చిన కార్యవర్గ వివరాలను తరువాత వెల్లడించారు. 

కాగా తానాలో ఎన్నికలు లేకుండా ఇరువర్గాలు రాజీ పడేలా ఎంతో కృషి చేసిన జయరాం కోమటి, నాదెళ్ల గంగాధర్‌, జంపాల చౌదరిలను అందరూ అభినందించాలి. 

తానా సారధులు...

గత ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన నిరంజన్‌ శృంగవరపు తానా మహాసభల చివరిరోజున సంప్రదాయం ప్రకారం అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. సౌమ్యునిగా పేరు ఉన్న నిరంజన్‌ శృంగవరపు తానా సేవలను మరింతగా విస్తృతం చేయనున్నట్లు ప్రకటించారు. 

అలాగే కొత్తగా 2025-27కి అధ్యక్షుడిగా వస్తున్న డా నరేన్‌ కొడాలి కూడా సౌమ్యునిగా పేరు పొందిన వారు ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పిన ఆయన ఇప్పుడు తానాకు తనవంతుగా సేవలందించనున్నారు.  

ఇప్పటి వరకు 36,000 మంది సభ్యులతో వున్న తానా ఇప్పుడు 70,000 మంది సభ్యులతో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా మారిన తానా వీరి నాయకత్వంలో మరింతగా వెలుగుతుందని తెలుగు టైమ్స్‌ ఆశిస్తోంది. 

తానా ఏకగ్రీవ కార్యవర్గం ఇదే...

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కొత్త కార్యవర్గం 2023`25 సంవత్సరానికిగాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తానా బోర్డు సభ్యులు(2023`27)గా రమాకాంత్‌ కోయ, రవి పొట్లూరి, సతీష్‌ వేమూరి ఎన్నికయ్యారు. డోనర్‌ డైరెక్టర్‌గా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.     

తానా ఫౌండేషన్‌ ట్రస్టీలుగా 2023-27 సంవత్సరానికిగాను భక్త వి భల్లా, శ్రీధర్‌ కుమార్‌ కొమ్మాలపాటి, శ్రీనివాస్‌ కూకట్ల, సతీష్‌ మేక, శ్రీనివాస్‌ ఎండూరి ఎన్నికయ్యారు. డోనర్‌ ట్రస్టీలుగా సురేష్‌ పుట్టగుంట, రవి సామినేని ఎన్నికయ్యారు. 

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా 2023`25 సంవత్సరానిగాను ఈ కింది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్‌గా నిరంజన్‌ శృంగవరపు (గతంలోనే ఎన్నికయ్యారు), ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా నరేన్‌ కొడాలి, సెక్రటరీగా అశోక్‌ బాబు కొల్లా, ట్రెజరర్‌గా వెంకట (రాజా) కసుకుర్తి, జాయింట్‌ సెక్రటరీగా శిరీష తూనుగుంట్ల, జాయింట్‌ ట్రెజరర్‌గా సునీల్‌ పంట్ర, కమ్యూనిటీ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌గా లోకేష్‌ కొణిదెల, కల్చరల్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌గా వంశీ వాసిరెడ్డి, కౌన్సిలల్‌ ఎట్‌ లార్జ్‌ గా రజనీకాంత్‌ కాకర్ల, ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌గా టాగూర్‌ మల్లినేని, స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌గా నాగమల్లేశ్వరరావు పంచుమర్తి, ఉమెన్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌గా మాధురి డి ఎల్లూరి ఎన్నికయ్యారు.

రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌గా రాజేష్‌ యార్లగడ్డ (అప్పలాచియాన్‌), సత్యవర్థన్‌ సూరపనేని (క్యాపిటల్‌), పరమేష్‌ దేవినేని (డిఎఫ్‌డబ్ల్యు), భాస్కర మలినేని (మిడ్‌ అట్లాంటిక్‌), శ్రీహర్ష గరికపాటి (మిడ్‌ వెస్ట్‌), కృష్ణ ప్రసాద్‌ సొంపల్లి (న్యూ ఇంగ్లాండ్‌), రామకృష్ణ వాసిరెడ్డి (న్యూజెర్సి), కృష్ణ దీపిక సమ్మెట (న్యూయార్క్‌), విష్ణు వి జంపాల (నార్త్‌), శ్రీమాన్‌ ఎన్‌. యార్లగడ్డ (నార్త్‌ సెంట్రల్‌), శ్రీనివాస్‌ అబ్బూరి (నార్త్‌ వెస్ట్‌), వెంకట్‌ అడుసుమిల్లి (నార్తర్న్‌ కాలిఫోర్నియా), శివలింగ ప్రసాద్‌ చావ(ఒహాయో వ్యాలీ), శేఖర్‌ కొల్లా (రాకీ మౌంటెన్‌), ఇమేష్‌ చంద్ర గుప్తా (సౌత్‌ సెంట్రల్‌), మధుకర బి. యార్లగడ్డ (సౌత్‌ ఈస్ట్‌), సురేష్‌ మల్లిన (సదరన్‌ కాలిఫోర్నియా), లీలా కృష్ణ సుమంత్‌ పుసులూరి (సౌత్‌ వెస్ట్‌).

బోర్డ్‌ నిర్ణయాన్ని తప్పుపట్టిన శ్రీనివాస గోగినేని

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) డైరెక్టర్ల బోర్డు (బీఓడీ) ‘ఎన్నిక’కు బదులుగా ‘సెలక్షన్‌’కు వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోటీ చేసిన శ్రీనివాస గోగినేని తీవ్రంగా వ్యతిరేకించారు. ఫిర్యాదుల పరిష్కారం మరియు మధ్యవర్తిత్వం కోసం తానా బైలాస్‌లోని ఆర్టికల్‌ శIశని ప్రయోగిస్తూ, ఎంపిక ప్రక్రియను ఆయన ప్రశ్నించారు. ఈమేరకు ఆయన తానా బోర్డుకు 15 ప్రశ్నలు సంధించాడు.  

నరేన్‌పై పోటీ చేసిన శ్రీనివాస గోగినేని ఎంపిక ప్రక్రియపై అభ్యంతరాలు లేవనెత్తడంతో పాటు తక్షణ పరిష్కారం కోసం బోర్డుకు గ్రీవెన్స్‌ నోట్‌ పంపారు. ఆయా స్థానాలకు ఎంపిక చేసిన జాబితాలో పేర్లపై బోర్డు ఒక నిర్ధారణకు రావడంలో ఉన్న హేతుబద్ధతను ఆయన ప్రశ్నించారు.

 

 

Tags :