తెలంగాణలో కాషాయ పార్టీకే అనుకూల పరిస్థితులు : కిషన్ రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తే శక్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. భువనగిరిలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి తరపున నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాషాయ పార్టీకే అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. దేశంలో మేధావులు, విద్యావంతులు కమలదళానికి అండగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇకపై తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్కు వ్యతిరేకంగానే ఫలితాలు ఉంటాయని జోస్యం తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఇమడలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని తెలిపారు. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ప్రజలను మళ్లీ ఏ విధంగా ఓట్లడుగుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే దాకా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.