Amit Shah: ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలి : అమిత్ షా!

ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అన్ని రాష్ట్రాలను కోరారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల (Chief Ministers)తో ఆయన మాట్లాడారు. తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయుల (Pakistanis)ను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో భారత్ సార్క్ వీసా (SAARC Visa) పొడిగింపు పథకం కింద చాలా మంది పాక్ జాతీయులకు భారత్లో పర్యటించే అవకాశాలను కల్పించారు. ఈ ప్రోగ్రామ్ కింద భారత్లో ఉన్న ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ వీసాలు పొందిన వారికి మాత్రం ఏప్రిల్ 29వ తేదీ వరకు అవకాశం ఉంది. ఇక పాక్ నుంచి కొత్త దరఖాస్తుదారులకు వీసా సర్వీసులను తక్షణమే నిలిపివేశామని విదేశాంగ శాఖ పేర్కొంది. దీంతోపాటు పాక్లో ఉన్న భారత జాతీయులు తిరిగి వచ్చేయాలని అడ్వైజరీ జారీ చేసింది. అదే సమయంలో ఇక్కడ పాక్ జాతీయులు గడువు ముగిసేలోపు దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించింది.