Operation Sindoor: ఆపరేషన్ సిందూర్తో ఉగ్రభూతానికి చెక్

కాల్పుల విరమణ తాత్కాలికమే…
తోక జాడిస్తే నామరూపాల్లేకుండా చేస్తాం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ
ఉగ్రవాద చర్యలకు ఇకపై ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తోనే బదులిస్తాం. ఇదే భారత ప్రభుత్వ నీతి. ఇదే మన నూతన విధానం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ (Modi) స్పష్టంగా ప్రకటించారు. ‘‘దాయాది అణు బెదిరింపులకు దిగితే సహించే ప్రసక్తే లేదు. అంతేకాదు, ఉగ్రవాదాన్నీ, దానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న పాక్ ప్రభుత్వాన్నీ ఇకనుంచి వేర్వేరుగా చూడబోం. పాక్ చర్యలన్నింటినీ ఇకపై ‘సిందూర్’ గీటురాయితోనే పరిశీలిస్తాం. మనపై ఎలాంటి దుశ్చర్యకు పాల్పడ్డా ‘సిందూర్’ తరహాలో ఆ దేశంపై నిర్ణాయక రీతిలో దాడులు చేస్తామని కూడా చెప్పారు’’ అని కుండబద్దలు కొట్టారు. పాక్ ‘అణు’ ఆటలు మనముందు సాగవని ఆ దేశ సైనిక స్థావరాలపై జరిపిన దాడులతో ప్రపంచానికి ఇప్పటికే నిరూపించామన్నారు. ‘‘కశ్మీర్ మంచుకొండల నుంచి రాజస్తాన్ ఎడారుల దాకా పాక్ దాడులన్నింటినీ తిప్పికొట్టాం. కేవలం మన సరిహద్దులపై దాడికి ప్రయత్నించినందుకే దాయాది ఆయువుపట్లను తూట్లు చేశాం. అది గొప్పగా చెప్పుకునే వైమానిక స్థావరాలన్నింటినీ పూర్తిగా నేలమట్టం చేసి కాళ్లబేరానికి తీసుకొచ్చామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు పునరుద్ధరణపై క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా… నీరు, నెత్తురూ కలిసి ప్రవహించలేవని స్పష్టం చేశారు. నీరు, నెత్తురు ప్రస్తావన పాకిస్థాన్కు స్పష్టమైన సందేశమని అన్నారు.ఇదే సమయంలో ఉగ్రవాదం, చర్చలు కలిసి జరగవని.. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి నడవవని.. నీరు, నెత్తురు కూడా కలిసి ప్రవహించవని ప్రధాని మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికి భారత్ తన చర్యను మాత్రమే నిలిపి వేసిందని.. దాని తదుపరి చర్య, పాకిస్థాన్ చర్యలపై ఆధారపడి ఉంటుందని దాయాదీని హెచ్చరించారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ఆపరేషన్ సిందూర్ స్పష్టంగా చెప్పిందని నొక్కి చెప్పిన ప్రధాని… దాని నిబంధనల ప్రకారం అది ఉగ్రవాదానికి ప్రతిస్పందిస్తుందని, ఇకపై ఇస్లామాబాద్ తరచూ ఉపయోగించే అణు బ్లాక్ మెయిల్ ను సహించబోమని స్పష్టం చేశారు.
‘‘అన్నింటికంటే ముందు మన సేనలు, నిఘా విభాగాలు, శాస్త్రవేత్తలకు ప్రతి భారతీయుడి తరఫున సెల్యూట్ చేస్తున్నా. ఆపరేషన్ సిందూర్ లక్ష్యం సాధించడానికి మన వీర సైనికులు విశేష శౌర్య పరాక్రమాలు ప్రదర్శించారు. నేను వారి వీరత్వం, సాహసం, పరాక్రమాన్ని ఈ దేశంలోని తల్లులు, సోదరీమణులు, ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నా. పహల్గాంలో ఉగ్రవాదుల ప్రవర్తన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సెలవుల్లో ఆనందంగా గడుపుతున్నవారిని మతం అడిగి మరీ పిల్లల ముందు పాశవికంగా చంపడం ఉగ్రవాద వికృత రూపానికి, క్రూరత్వానికి పరాకాష్ఠ. దేశ సామరస్యాన్ని దెబ్బతీయడానికి వారు ప్రయత్నించారు. ఇది నాకు వ్యక్తిగతంగా అత్యంత దుఃఖం కలిగించింది. ఈ దాడి తర్వాత దేశం మొత్తం ఒక్కటైంది. ఉగ్రవాదంపట్ల కఠినంగా వ్యవహరించాలని నినదించింది. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపేందుకు ఆ తర్వాతే మేం భారత సేనలకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాం. మన సోదరీమణులు, బిడ్డల నుదుటి సిందూరం తుడిచేయడానికి ప్రయత్నించిన ప్రతి ఉగ్రవాది, ఉగ్రవాద సంస్థలకు దాని పర్యవసానం ఏమిటో తెలిసి వచ్చింది.
భారత్తో యుద్ధానికి దిగిన ప్రతిసారీ పాక్ను మట్టి కరిపించాం’’ అని గుర్తు చేశారు. ఆ విజయపరంపరలో ఆపరేషన్ సిందూర్ను కలికితురాయిగా అభివర్ణించారు. పాక్ ప్రభుత్వం, సైన్యం కలసికట్టుగా దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాద భూతం చివరికి ఆ దేశాన్నే కబళిస్తుందని మోదీ హెచ్చరించారు. ‘‘ఆ దేశం మనుగడ సాగించాలంటే ఉగ్రవాదాన్ని దాని గడ్డపై నుంచి కూకటివేళ్లతో పెకిలించాల్సిందే. దానికి మరో మార్గం లేదు’’ అంటూ హితవు పలికారు. పాక్పై మన సైనిక విజయాన్ని దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి, కూతురికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు.
‘సిందూరం కేవలం పేరు కాదు. సరైన న్యాయానికి అఖండ ప్రతిజ్ఞ. కోట్లాది భారతీయుల భావనలకు ప్రతిరూపం. ఉగ్రవాదం తాలూకు వికృత రూపమే పహల్గాం దాడి! అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి నన్నెంతగానో కలచివేసింది. భార్యాపిల్లల కళ్లముందే ఒక్కొక్కరిని కాల్చి పొట్టన పెట్టుకున్న వికృతత్వాన్ని ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండిరచాయి. అందుకు ప్రతీకారం కోసం దేశమంతా ఒక్కటైంది. ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. వారు కలలో కూడా ఊహించని విధంగా పాక్, పీఓకేలోని బహావల్పూర్, మురిద్కే తదితర ఉగ్రవాద కేంద్రాలు, శిక్షణ శిబిరాలపై మన సైన్యం విరుచుకుపడి నేలమట్టం చేసింది. అవన్నీ నిజానికి ప్రపంచ ఉగ్రవాద యూనివర్సిటీలు. అమెరికాపై 9/11, లండన్ మెట్రో తదితర దాడులన్నింటికీ అక్కడినుంచే పథకరచన జరిగింది. అలాంటి కేంద్రాలతో పాటు ఉగ్రవాదుల స్థైర్యాన్ని కూడా మన సైన్యం ధ్వంసం చేసింది. దశాబ్దాలుగా పాక్ గడ్డపై బాహాటంగా రొమ్ములు విరుచుకుని సంచరిస్తున్న 100 మందికి పైగా అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులను హతమార్చింది. మన మహిళల నుదుటి సిందూరం తుడిపేస్తే ఏమవుతుందో ప్రతి ఉగ్ర ముఠాకూ తెలిసొచ్చేలా చేశాం. ఉగ్రతండాలనే సమూలంగా తుడిచిపెట్టేశాం. ఉగ్ర కేంద్రాలపై మన దాడితో పాక్ బిక్కచచ్చిపోయింది. మన దాడుల్లో హతమైన ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది. వాటిలో పాక్ సైనిక ఉన్నతాధికారులు బాహాటంగా పాల్గొన్నారు. పాక్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారనేందుకు ఇది తిరుగులేని రుజువు.
తన గడ్డ మీది ఉగ్ర శిబిరాలు తుడిచిపెట్టుకుపోయాయనే నిరాశతో పాక్ దుస్సాహసానికి దిగింది. ఉగ్ర పోరులో మనతో కలిసి రావాల్సింది పోయి మనపైనే దాడులకు తెగబడిరది. విచక్షణ కోల్పోయి మన సైనిక స్థావరాలతో పాటు విద్యా సంస్థలు, ప్రార్థనాలయాలు, ఇళ్లను కూడా లక్ష్యం చేసుకుంది. కానీ ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది. పాక్ డ్రోన్లు, క్షిపణులను మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎక్కడివక్కడ నేలకూల్చింది. మనం అంతటితో ఆగలేదు. వాళ్లు సరిహద్దులపై దాడి చేస్తే నేరుగా పాక్ గుండెకాయకే గురిపెట్టాం. ప్రధాన నగరాల్లోని వాళ్ల కీలక సైనిక, వైమానిక స్థావరాలన్నింటినీ నేలమట్టం చేశాం. పాక్ సైన్యానికి ఊహించలేనంత నష్టం మిగిల్చాం. ఆ క్రమంలో మన బలగాలు అంతులేని సామర్థ్యాన్ని, సంయమనాన్ని ఏకకాలంలో అద్భుత రీతిలో ప్రదర్శించాయి. మన దేశీయ ఆయుధ వ్యవస్థ తాలూకు పాటవాన్ని పూర్తిస్థాయిలో రుచిచూపాయి. దాంతో భయపడ్డ దాయాది కాళ్లబేరానికొచ్చింది. ఎలాగోలా పరువు కాపాడుకునే ప్రయత్నాలకు దిగింది. కాపాడండంటూ ప్రపంచ దేశాలను వేడుకుంది. మే 10న మన పాక్ డీజీఎంఓ మన డీజీఎంఓకు కాల్ చేశారు.
‘‘ఇకపై మా గడ్డపై ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలూ, సైనిక దుస్సాహాసాలూ జరగబోవు’’ అని స్పష్టంగా హామీ ఇచ్చారు. అప్పటికే పాక్ గుండెలపై పుట్టుకొచ్చిన ఉగ్ర తండాలన్నింటినీ మనం నేలమట్టం చేయడమే గాక దాని పీచమణచాం. కనుక వారి అభ్యర్థనపై ఆలోచించాం. అయినా కాల్పులకు కేవలం విరామం మాత్రమే ఇచ్చాం. ఎలాంటి కవ్వింపులకు దిగినా పాక్కు మరోసారి బుద్ధి చెప్పేందుకు మన సైన్యం, వైమానిక, నావికా దళాలు, బీఎస్ఎఫ్ సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. ఉగ్రవాదంపై భారత వైఖరి సుస్పష్టమని మోదీ చెప్పారు. ‘‘ఉగ్రవాదం, వాణిజ్యం, చర్చలు ఏకకాలంలో కొనసాగలేవు. నీళ్లు, రక్తం కలసికట్టుగా పారడం జరగని పని’’ అని స్పష్టం చేశారు. తద్వారా ఉగ్రవాదానికి పాక్ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేదాకా ఆ దేశంపై ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు, సింధూ జలాల ఒప్పందం నిలిపివేత తదితర చర్యలు కొనసాగుతాయని చెప్పకనే చెప్పారు. ‘‘ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్కు అప్పగించి తీరాల్సిందే. పాక్తో ఏ చర్చలైనా కేవలం ఈ రెండు అంశాలపైనే జరుగుతాయి. పాక్తో పాటు ప్రపంచ దేశాలకు కూడా ఈ విషయం స్పష్టం చేస్తున్నా’’ అంటూ ప్రధాని కుండబద్దలు కొట్టారు.
ఈ ఆపరేషన్ ద్వారా మనదేశంలో తయారైన ఆయుధాల ప్రామాణికత నిరూపితమైంది. ఈ యుగం యుద్ధానిది కాదు… ఉగ్రవాదులదీ కాదు. వికసిత్ భారత్ కలలను సాకారం చేసుకోవాలంటే భారత్ శక్తిశాలి కావడం చాలా అవసరం. అవసరమైనప్పుడు ఈ శక్తిని ఉపయోగించడం కూడా అత్యవసరం. గత కొన్ని రోజుల్లో భారత్ ఇదే చేసింది’’ అని మోదీ పేర్కొన్నారు. ‘భారత్ మాతాకీ జై’ అని మూడుసార్లు నినదించి ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించిన చేసిన ప్రసంగం అనంతరం.. బీజేపీ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సెలబ్రెటీలు.. ఇది మామూలు స్పీచ్ కాదని, పాక్ కు ఇవి మామూలు హెచ్చరికలు కావని, ఉగ్రవాదులు ఇకపై భారత్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయని స్థాయిలో ఈ ప్రసంగం ఉన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లులు కురిపించారు. మరోవైపు ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయ్యిందని దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరిట క్యాపెయిన్ చేపట్టనుంది బీజేపీ. ఇందులో భాగంగా… మే 13 నుంచి ఈ యాత్రను ప్రారంభించి ప్రధాని మోడీ నాయకత్వ పటిమ గురించి ప్రజలకు వివరించనున్నట్లు ప్రకటించింది.