ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నా.. అమెరికా మాత్రం
ఇజ్రాయెల్ చర్యలను ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండిస్తున్నా అమెరికా మాత్రం నిస్సిగ్గుగా సమర్ధిస్తూనే వస్తోంది. తాజాగా రఫాలో జరిపిన దాడిలో 45 మంది అమాయకులు మరణించడంపై అంతర్జాతీయంగా ఖండనలు, విమర్శలు వస్తున్నా అమెరికా మాత్రం ఒక అడుగు ముందుకేసి ఇజ్రాయెల్ ఇంకా తాము విధించిన లక్ష్మణ రేఖను దాటలేదంటూ చెబుతోంది. పైగా ఆయుధాల సరఫరా ఆపేది లేదని తెగేసి చెప్పింది. అమెరికా జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్జీ మీడియతో మాట్లాడుతూ ఇజ్రాయెల్ చర్యల ఫలితంగా తాము ఆ దేశం పట్ల అనుసరిస్తున్న విధానాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. అవసరమతే భవిష్యత్తులో ఆయుధాల బదిలీని ఆపు చేసేందుకు అధ్యక్షుడు జో బైడెన్ విధించిన రెడ్ లైన్ ను ఇజ్రాయెల్ ఇంకా దాటలేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కూడా దాటదని అనిపిస్తోదని అన్నారు. ఎంతమంది పౌరులు చనిపోతే ఇజ్రాయెల్ను శిక్షించాలనేది నిర్ణయించడానికి కొలమానం అంటూ లేదని తెలిపారు.






