అమెరికా శాస్త్రవేత్తల ఘనత …
గంట కన్నా తక్కువ సమయంలోనే కరోనా వైరస్ ఉనికిని గుర్తించే ఒక ర్యాపిడ్ పరీక్ష విధానాన్ని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనికి పెద్దగా ఉపకరణాలు అవసరం ఉండదు. ప్రామాణిక కొవిడ్ 19 పరీక్ష విధానం స్థాయిలోనే ఇది సమర్థంగా పనిచేస్తుంది. మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు ఈ ఘనత సాధించారు. ఈ సాధనానికి స్టాప్ కొవిడ్ అనే పేరు పెట్టారు. దీన్ని చౌకైన వస్తువులతో తయారు చేశారు. ఫలితంగా ప్రజలు నిత్యం స్వయంగా కరోనా పరీక్షలు నిర్వహించుకోవచ్చు. ఒకే అంచెలో పక్రియ మొత్తాన్ని ముగించే విధానాన్ని తాము కనుగొన్నామని పరిశోధనలో పాలుపంచుకున్న జూలియా యంగ్ చెప్పారు. అందువల్ల దీన్ని నిపుణులే కాకుండా ఇతరులూ నిర్వహించొచ్చని తెలిపారు.
ల్యాబ్లకు వెలుపల కూడా పరీక్షను చేపట్టవచ్చని వివరించారు. ఈ విధానంలో నమూనాలలోని వైరస్ జన్యు పదార్థానికి అయస్కాంత పూసలను జోడిస్తారు. ఇవి వైరస్లోని ఆర్ఎన్ఏను ఆకర్షిస్తాయి. ఫలితంగా జన్యు పదార్థ సాంద్రత పెరుగుతుంది. దీనివల్ల ఖరీదైన శుద్ధి కిట్లను అవసరం ఉండదు. పైగా అలాంటి పక్రియలను ఎంతో సమయం పడుతుంది. ఆర్ఎన్ఏ సాంద్రత పెరగడం వల్ల పరీక్ష సున్నితత్వం పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పాజిటివ్ కేసులు నిర్ధారణలో ఈ కొత్త విధానం 93 శాతం మేర కచ్చితత్వాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు.






