ప్రపంచ జాబితాలో దేశం రెండవ స్థానం
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 89,706 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 43,70,129కి చేరింది. కరోనా కేసుల ప్రపంచ జాబితాలో దేశం రెండవ స్థానంలో ఉంది. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డాటా ప్రకారం గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 1,115 మంది చనిపోగా, 74,894 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 8,97,394 యాక్టివ్ కేసులు ఉండగా, 33,98,884 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా వల్ల ఇప్పటి వరకు దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 73,890. కరోనా రోగుల రికవరీ రేటు 77.77 శాతం ఉండగా, యాక్టివ్ కేసులు 20.53 శాతంగా ఉన్నాయి. ఇక మరణాల రేటు 1.69 శాతానికి తగ్గింది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,54,549 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుపగా, ఇప్పటివరకు మొత్తం 5,18,04,677 పరీక్షలు నిర్వహించారు.






