ఫోర్బ్స్ మహిళా ధనవంతుల జాబితాలో.. భారత సంతతి మహిళలు
అమెరికాలో తొలి వంద మహిళా సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసిది. ఈ జాబితాలో నలుగురు భారత సంతతి మహిళలు చోటు దక్కించుకున్నారు. వ్యక్తిగత ఆస్తుల విలువతో పాటు కంపెనీల్లో వారికున్న వాటాల విలువ ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో పెప్సికో మాజీ చైర్మన్, సీఈవో ఇంద్రా నూయీ, ఆరిస్టా నెట్వర్క్ ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లాల్, సింటెల్ ఐటీ సంస్థ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథీ, కాన్ఫ్లూయెంట్ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖడే ఉన్నారు.
జయశ్రీ ఉల్లాల్ 2.4 బిలియన్ డాలర్ల నికర ఆస్తులతో 15వ స్థానంలో ఉన్నారు. జయశ్రీ 2008 నుంచి ఆరిస్టా నెట్వర్క్ ప్రెసిడెంట్, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలో ఆమెకు 2.4 శాతం వాటా ఉన్నట్లు తెలిపింది. నీర్జా సేథీ సింటెల్ సహ వ్యవస్థాపకురాలిగా 990 మిలియన్ డాలర్ల సంపదతో నీర్జా జాబితాలో 25వ స్థానంలో కొనసాగుతున్నారు. 1980లో భర్త భరత్ దేశాయ్తో కలిసి నీర్జా సింటెల్ను స్థాపించారు. కంపెనీ నుంచి తన వాటా కింద ఆమె 510 మిలియన్ డాలర్లు పొందినట్లు వెల్లడిరచింది. నేహా నార్ఖడే 520 మిలయన్ డాలర్ల సంపదతో 50వ స్థానంలో ఉన్నారు. నేహా గతంలో లింక్డ్ఇన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. 2014లో లింక్డ్ఇన్ను వీడి, ఇద్దరు సహోద్యోగులతో కలిసి కాన్ఫ్లూయెంట్ను స్థాపించారు. సంస్థలో నేహాకు ఆరు శాతం వాటా ఉన్నట్లు తెలిపింది.
ఇంద్రానూయీ 350 మిలియన్ డాలర్ల సంపదతో 77వ స్థానంలో ఉన్నారు. 2019లో ఆమె పెప్సికో నుంచి పదవీ విరణమ చేశారు. 24 ఏళ్ల పాటు సంస్థలో అత్యున్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించిన ఇంద్రనూయీ, పెప్సికో ఆదాయాన్ని పెంచారు. 2019లో పెప్పికో నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత నుంచి అమెజాన్లో బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఇక ఈ జాబితాలో మొదటి స్థానంలో ఏబీసీ సప్లై సహా వ్యవస్థాపకురాలు డైనీ హెండ్రిక్స్ చోటు సంపాదించుకున్నారు. ఆమె ఈ ఘనతను సాధించడం వరుసగా ఆరోసారి. ప్రస్తుతం ఆమె నికర ఆస్తుల విలువ 15 బిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ తెలిపింది.






