కేజ్రీవాల్ కు ఊరట.. మధ్యంతర బెయిల్
లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు లో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయనకు జూన్ వరకు బెయిల్ ఇస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. రూ.50 వేల పూచీకత్తు, అంతే మొత్తానికి ఒకరి ష్యూరిటీపై ఈ బెయిలిచ్చింది. కేజ్రీవాల్ జూన్ 5వ తేదీ వరకు ( ఎన్నికల ఫలితాల మరుసటిరోజు) మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సీఎం తరపు న్యాయవాది అభిషేక్ సింఫ్వీు చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. జూన్ 2న ఆయన లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది.
ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది. సీఎం కార్యాలయానికి గానీ, ఢిల్లీ సచివాలయానికి గానీ వెళ్లొద్దని సూచించింది. మద్యం కేసులో తనపై వచ్చిన అభియోగాల గురించి కూడా మాట్లాడొద్దని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన అధికార ఫైళ్లను చూడొద్దని, సాక్షులతో మాట్లాడొద్దని తెలిపింది. తీర్పు అనంతరం సీఎం తరపున న్యాయవాదులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంపై కోర్టు ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు.