ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు.. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ
మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. మహిళగా పీఎంఎల్ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు అర్హత ఉందన్నారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం నేడు కవిత పిటిషన్లను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల విచారణ సందర్భంగా కవితతో పాటు ఈడీ, సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కవితను అరెస్ట్ చేశారని ఆమె తరపు న్యాయవాది వాదించారు. ఈడీ కస్టడీలో ఉండగా సీబీఐ అరెస్ట్ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్కు కవిత స్టార్ క్యాంపెయినర్ అని చెప్పారు. ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ, ఈడీ తరపున న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. దర్యాప్తునకు కవిత ప్రభావితం చేయగలుగుతారన్నారు. ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నారని సూత్రధారి, పాత్రధారి ఆమేనని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నేడు కవితకు బెయిల్ నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.