బీజేపీ నేషన్ ఫస్ట్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మాత్రం ఫ్యామిలీ ఫస్ట్ : మోదీ
హఠాత్తుగా రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో అంబానీ, అదానీల గురించి మాట్లాడడం మానేశారెందుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. వారితో ఏమైనా రహస్య ఒప్పందం కుదిరి ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించారు. మీరు గత పదేళ్ల నుంచి కాంగ్రెస్ యువరాజును చూడండి. తరచూ అంబానీ-అదానీ పేర్లే చెబుతుంటాడు. కానీ, ఎన్నికల ప్రకటన వచ్చిన నాటినుంచి వారిని వెక్కిరించడం మానేశాడు. వారి నుంచి ఎంత సొమ్ము తీసుకకొన్నారో రాహుల్ తెలంగాణ ప్రజలకు చెప్పాలి. డబ్బు కట్టలతో భారీ వాహనాలు కాంగ్రెస్కు చేరుకొన్నాయా. ఏం ఒప్పందం జరిగింది? రాత్రికి రాత్రే వారిని విమర్శించడం ఆపేశావు. మొత్తం మీద కచ్చితంగా ఏదో ఉంది అని మోదీ ప్రశ్నించారు. బీజేపీ నేషన్ ఫస్ట్ అని పనిచేస్తుంటే, కాంగ్రెస్, బీఆర్ఎస్లు మాత్రం ఫ్యామిలీ ఫస్ట్ అని అంటున్నాయన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్ అవమానించడానికి ఈ పాలసీనే కారణమన్నారు.