గతంలో బీఆర్ఎస్... ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలోనే : మోదీ
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ.లక్షల కోట్లు ఇచ్చిందని, ఆ నిధులన్నీ అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కారు కాళేశ్వరం పేరిట లూటీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్లోకి వెళ్తోందని విమర్శించారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని దుయ్యబట్టారు. తాను ఎవరి పేరు చెప్పకపోయినప్పటీకి ఆర్ఆర్ ట్యాక్స్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందిచారని, దీనిని బట్టి ఆ ట్యాక్స్ ఎవరు వసూలు చేస్తున్నారో అర్థమవుతోందని అన్నారు.
మహబూబ్నగర్ ప్రాంతాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తమ స్వార్థానికి వాడుకున్నారు. ఈ ప్రాంతానికి కృష్ణా, తుంగభద్ర నదుల ఆశీర్వాదం ఉంది. సాగునీటి ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఇచ్చినప్పటికీ ఈ రాష్ట్రం సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఇత రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి అని అన్నారు. కాంగ్రెస్ రాకుమారుడు ఎన్నికలు రాగానే విద్వేషం విషం చిమ్ముతున్నారు. ఆయన రాజగురువు మనల్ని రంగు ఆధారంగా విభజిస్తున్నారు. శరీర రంగును బట్టి దక్షిణ భారత్ వాళ్లు ఆఫ్రికన్లు అని మాట్లాడారు. కాంగ్రెస్కు హిందువులు, వారి పండుగలు అంటే ఇష్టం లేదు. హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. కులాలు, మతాల పేరిట దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ చూస్తోంది. మతపరమైన రిజర్వేషన్లను అంబేడ్కర్ కూడా వ్యతిరేకించారు. అలాంటి రిజర్వేన్లు ఇస్తే, మతమార్పిడులు పెరుగుతాయి. కాంగ్రెస్ అంటే అభివృద్ధి నిరోధకులు, దేశ వ్యతిరేకులు. మహబూబ్నగర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి అని విమర్శించారు.