నెల మొదలు.. పెన్షన్ల కష్టాలు మొదలు..
ఈరోజు నుంచి కొత్త నెల ప్రారంభం అవుతుంది.. కానీ పెన్షనర్ల పరిస్థితిలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. పెన్షన్లు సకాలంలో అందివ్వాల్సిందిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెన్షన్లు సకాలంలో అందించే విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించింది. సచివాలయ ఉద్యోగులను పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఉపయోగించుకోవాలని తెలియపరచింది. ఈ నేపథ్యంలో మే నెల 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు నేరుగా బ్యాంకు ఖాతాలలో ఒకటో తారీఖున పెన్షన్ పడుతుందని.. ఖాతాలు లేని వారికి సిబ్బంది ద్వారా పంపిస్తామని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. మే 1 రానే వచ్చింది.. అయితే ఈరోజు కార్మికుల దినం కావడంతో బ్యాంకులకు సెలవు. అంటే ఈరోజు పెన్షన్లు లేనట్టే.. కనీసం రేపటికైనా పెన్షన్ ల పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందో లేదో చూడాలి. మరోపక్క బ్యాంకు ఖాతాలు లేని వారికి ఈరోజు ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉందని టాక్.